రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై హత్యా యత్నం జరిగింది. ఓ వ్యక్తి పదునైన తాపీతో పొడిచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన బందరు లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆదివారం మంత్రి నాని మచిలీపట్నంలో తన నివాసంలో ఉండగా ఓ వ్యక్తి కాళ్లకు దండం పెడుతూ పదునైన తాపీ తో దాడికి తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనలో మంత్రి చొక్కా చినిగి పోగా ప్రమాదం త్రుటిలో తప్పింది. మంత్రిపై దాడికి పాల్పడిన వ్యక్తి తాపీ మేస్త్రి బడుగు నాగేశ్వరావు గా గుర్తించారు. నిందితుడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి నాని పై హత్యాయత్నం జరిగిన విషయం తెలియటంతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు నాని నివాసానికి చేరుకున్నారు. పలువురు నేతలు మంత్రి నాని కి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఘటన గురించి నాని ఏమన్నారంటే…
“ఈ రోజు మా ఇంట్లో నా తల్లి దశదిన కర్మ జరుగుతుంది, అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఇంటికొచ్చారు. ఒక వ్యక్తి నా కళ్లపై పడుతున్నట్టు ముందుకు వచ్చాడు. ఒక్క సారిగా తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో దాడి చేసి పొట్టలో పొడిచే ప్రయత్నం చేడాడు. అదృష్టవశాత్తు నాకు తగల్లేదు. రెండోసారి పొడిచే ప్రయత్నం చేస్తుండగా గన్మెన్లు పట్టుకుని పోలీసులకు అప్పరించారు. అదృష్టవశాత్తు నాకు ఏమి కాలేదు. క్షేమంగా ఉన్నాను” అని మంత్రి నాని పేర్కొన్నారు.