మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికలకు సై అంటోంది.
కేవలం ఇరవై మూడు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చినప్పటికీ టిడిపి చేవ ఇంకా చావలేదు అన్న సంకేతాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇస్తున్నారు.పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా తమ పార్టీ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగుపడుతుందన్న చంద్రబాబు నాయుడు ఆశాభావంతో స్థానిక సంస్థల ఎన్నికల కదనరంగంలో దూకడానికి సన్నద్ధమయ్యారు. స్థానిక పంచాయితీకి టీడీపీ సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది.
యాక్షన్ ప్లాన్ రెడీ
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టిడిపి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల బరిలో నిలిచేందుకు టీడీపీ తీసుకుంటున్న చర్యలేంటి..? ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జిల్లా నేతలకు ఎన్నికల సందేశాన్ని పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు బుద్ధిచెప్పేందుకు ఇదే అవకాశమని స్పష్టం చేశారు. వైసీపీ నేతల ఓటమితోనే రాక్షస పాలన అంతమవుతుందని చెప్పుకొచ్చారు.175 నియోజకవర్గాల బాధ్యులు, మండల పార్టీ బాధ్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ.. సూచించారు.
అప్రమత్తంగా ఉండండి…టెక్నాలజీ వాడండి!
గతంలో విధ్వంసాలు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఉద్రిక్తతలు తలెత్తినా వాటిని సెల్ఫోన్లలో రికార్డ్ చేసి అధికారులు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. అభ్యర్థులు, నాయకుల ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చంద్రబాబు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలే నాంది కావాలన్నారు చంద్రబాబు. రైతులు, పేదలు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కార వేదిక ఈ పంచాయతీ ఎన్నికలని తెలిపారు. స్థానిక స్వపరిపాలనకు టీడీపీ పెద్దపీటే వేసిందన్నారు.
టిడిపి పుంజుకుందన్న లెక్కలో బాబు!
ఓవరాల్గా.. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి.. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై గ్రామాల్లో ప్రచారం చేయాలని కోరారు టీడీపీ అధినేత.జగన్ ప్రభుత్వం గత ఏడాదిన్నరగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవేవీ వర్కౌట్ కావనే ఉద్దేశంతో టీడీపీ ఉందన్నట్టు తెలుస్తోంది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ టిడిపి బాగా పుంజుకుందని తప్పనిసరిగా తన మార్క్ ఈ ఎన్నికల్లో చూపగలదని ఆ పార్టీ లో ధీమా వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలు పునరావృతం కాబోవని మాత్రం టిడిపి గట్టిగా విశ్వసిస్తోంది.