తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కన్నుమూసినట్లు తెలిసింది. సాయి చంద్ మృతి పట్ల సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న సాయిచంద్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు.
రాష్ట్ర సాధన లో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం గా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కతిక ఉద్యమాన్ని సీఎం కేసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అతని గొంతు లేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్త హృదయులైన సాయి చంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. సాయిచంద్ మృతికి మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ తదితరులు సంతాపం తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్ హౌస్ కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే .. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురి కాగా, స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయిచంద్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సాయిచంద్ భౌతికకాయాన్ని బీఎన్ రెడ్డి నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మరో సారి ఘాటుగా విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్