టికెట్ల వ్యవహారం, కేటాయింపులు.. సర్వేలు.. వంటివి వైసీపీలో సెగ పెడుతున్నాయి. నేతలకు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయినప్పటికీ.. పార్టీ అధిష్టానం మాత్రం తన పంతమే నెగ్గించుకుం టోంది. ఇక, పార్టీని తమ లైన్లోకి తెప్పించుకోవడం సాధ్యం కాదని అనుకుంటున్న వారు.. పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికి అరడజను మంది వైసీపీకి రాం రాం చెప్పారు. మరింత మంది కూడా ఇదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పటి వరకు సీఎం జగన్తో ఈ వ్యవహారంలో గొడవ పడిన నాయకులు లేరు. ఆయన చెప్పింది.. విన్నవారు విన్నారు. వినలేని బయటకు వచ్చారు. కానీ, ఫస్ట్ టైమ్ మాత్రం ఒక కీలక నేత సీఎం జగన్తో నువెంత.. అంటే నువ్వెంత అన్నట్టుగా ఘర్షణకు దిగినట్టు సమాచారం. అది కూడా.. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన నాయకుడేనని.. సీఎం జగన్తో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడేనన్న ప్రచారం మెయిన్ మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హోరెత్తిపోతోంది.
ఇదే విషయం తాడేపల్లి వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. గతంలో తనకు టికెట్ లేదని చెప్పడంతో హిందూపురం ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్.. సలహాదారు సజ్జలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనకు పార్టీ నుంచి కూడా అదే రేంజ్లో హెచ్చరికలు వెళ్లాయి. జాగ్రత్తగా ఉండకపోతే.. కష్టాలు తప్పవని హెచ్చరికలు పంపారు. దీంతో ఆయన ముందు దూకుడు చూపించినా.. తర్వాత.. తన పరిస్థితి కళ్లకు కట్టడంతో సైలెంట్ అయ్యారు.
కానీ.. ఇప్పుడు మాత్రం సీఎం జగన్తో ఘర్షణకు దిగిన నాయకుడు.. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. సీఎం జగన్కు మిత్రుడు కూడా.. నువ్వు .. నువ్వు.. అనుకునే రేంజ్లో ఉన్నారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ, రెడ్డి ట్యాగ్ ఉండడంతో ఆయనకు మరో పదవిని ఇచ్చి కొంత ఆగ్రహం చల్లార్చారు. కానీ.. ఇప్పుడు ఆయనకు సీటు లేదని.. అవసరం అయితే ప్లేస్ మారాల్సి ఉంటుందని పార్టీ చెప్పడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెగింది. జిల్లాల విభజన సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని సదరు.. జిల్లాకు కేంద్రం చేశారు.
దీనిపై తీవ్ర విమర్శలు, స్థానికుల నుంచి ఉద్యమాలు వచ్చాయి. ఈ ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని అంచనా వేసిన సీఎం జగన్.. ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయన మాత్రం.. నేనే పోటీ చేస్తా.. నువ్వు టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. అని భీష్మించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనను బుజ్జగించే పనిని రెండు జిల్లాలకు చెందిన ఎంపీలకు అప్పగించినట్టు సమాచారం.