BJP party: లోక్సభ లో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్న బిజెపి రాజ్యసభలో మాత్రం పూర్తి మెజారిటీని గత ఏడేళ్లుగా సాధించలేకపోతోంది.ఇక ముందు సాధిస్తుందా అంటే అది కూడా కష్టసాధ్యంగానే కనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే రానున్న రోజుల్లో రాజ్యసభలో బీజేపీ బలం తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.అంతేగాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభలో బీజేపీకి ప్రాతినిధ్యం పూర్తిగా కరువు కాబోతోంది!
పూర్తి మెజారిటీ కి ముప్పై మంది కావాలి
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా బీజేపీకి ఇప్పుడు 93మంది సభ్యులున్నారు.అంటే పూర్తి మెజారిటీ మార్కు కు 30 మంది సభ్యులు తక్కువన్నమాట.రాజ్యసభలో ఏ పార్టీకైనా సభ్యులు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆయా పార్టీల కి ఉండే బలాబలాలను బట్టి లభిస్తుంటారు.ఎమ్మెల్యేల నుండి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం అనేది రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి ఇలా జరుగుతుంటుంది.2014,2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపి వీరవిహారం చేయటం తెలిసిందే.ఇప్పుడు ఆ పార్టీకి లోక్సభలో సొంతంగానే పూర్తి మెజారిటీ ఉంది.కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలను దక్కించుకోలేదు.అదే ఇప్పుడు రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులసంఖ్యపై ప్రభావం చూపుతోంది.
ఉన్నదే వూడిపోయే పరిస్థితి!
పూర్తి మెజారిటీ విషయం పక్కనబెడితే రానున్న రోజుల్లో బీజేపీకి ఉన్న సభ్యులు కూడా తగ్గిపోబోతున్నారు.వచ్చే ఏడాదిలోపు వివిధ పార్టీలకు చెందిన 71 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ కాబోతున్నారు.ఇందులో ఒక్క యుపి నుండే ఐదుగురు బిజెపి సభ్యులున్నారు.వీరిలో ఇద్దరు సమాజ్ వాదీ పార్టీ నుండి బిజెపిలోకి ఫిరాయించిన వారు.కాగావచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఆ ఎన్నికల్లో గనుక బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుంటే ఆ రాష్ట్రం నుండి బిజెపి రాజ్యసభ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఖాయం.ఇప్పుడున్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.ప్రతిపక్షాలు అక్కడ బలపడుతున్నాయి.యూపీలో బీజేపీకి ఏకపక్ష విజయం లభించే అవకాశాలు లేనందున ఆ రాష్ట్రం నుండి పార్టీ రాజ్యసభ సభ్యుల తగ్గే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలను బీజేపీ నిలుపుకోవడం దాదాపు అసాధ్యం అంటున్నారు.
BJP party: తెలుగు రాష్ట్రాల్లో సీనే లేదు!
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపికి సొంతంగా ఎంపీలు లేనప్పటికీ టిడిపికి చెందిన నలుగురిని తన ఖాతాలో వేసుకుంది.సుజనా చౌదరి, సీఎం రమేష్ ,టీజీ వెంకటేష్ గరికపాటి మోహన్రావులు మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయాక బిజెపి పక్షాన చేరడం తెలిసిందే.వీరందరూ కూడా రిటైర్ కాబోతున్నారు.ఆంధ్రప్రదేశ్లో అయితే బీజేపీకి ప్రాతినిధ్యం సున్నా!ఇప్పుడు ఏపీ తెలంగాణాల్లో టీఆర్ఎస్ ,వైసీపీల కి ఉన్న అత్యధిక మెజారిటీ కారణంగా ఆ రాష్ట్రాల నుండి బీజేపీ తరపున ఏ ఒక్కరూ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు లేవు.అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి.కాబట్టి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బిజెపికి కొత్త రాజ్యసభ సభ్యులు వచ్చే అవకాశం లేదు.ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో బిజెపికి పూర్తి మెజార్టీ రావడం అనేది జరిగేపని కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.