కాపు ఉద్యమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ పునః ప్రవేశంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. ఆయన ఈ పార్టీలో చేరుతున్నారు.. ఆ పార్టీలో చేరుతున్నారు.. అంటూ.. పెద్ద ఎత్తున కథనాలు అయితే వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఈ వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే.. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఇక, ఎప్పు డు చేరతారో కూడా తెలియదు. కానీ, చేరడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. అది జనసేన అధినేత పవన్ను బట్టి ఉంటుందనే చర్చ తాజాగా తెరమీదికి వచ్చింది.
ఇదిలావుంటే, అసలు ముద్రగడ ఇప్పటి వరకు ఏపార్టీలోనూ చేరకపోవడానికి ఆయన వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోం ది. అందుకే పార్టీలుఆయనను దూరం పెడుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి రెండేళ్లుగా ముద్రగడను చేర్చుకునేందు కు అధికార వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రయత్నాలేవీ ముడి పడడం లేదు. ఇక, ఇటీవల జనసేనలో చేరతారని కూడా అందరూ భావించారు. దీనికి సంబంధించి ఆయన రాసిన బహిరంగ లేఖే బలాన్ని చేకూర్చింది.
అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత తన ఇంటికి పవన్ వస్తానని చెప్పాడని.. కానీ, రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ముద్రగడ వ్యవహారం జనసేనలో ముగిసనట్టేననే వాదన కూడా వినిపిస్తోంది. ఆయన రాసిన లేఖ, తర్వాత.. ఏలూరు వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు వంటివి ముద్రగడకు బ్రేకులు వేశాయి. ఇదిలావుంటే, అసలు ఇన్నాళ్లుగా ఏ పార్టీ కూడా ముద్రగడను చేర్చుకోకపోవడానికి కారణం.. ఆయన కాపు డిక్లరేషన్ అమలు కోసం పట్టుబట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఇది ఇప్పుడున్న పరిస్థితి వైసీపీకి సాద్యం అయ్యే పనికాదు. ఇదేసమయంలో ఆయన తనకు టికెట్ తో పాటు (దీనిని ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమే) తన పరివారంలోని ఇద్దరు నుంచి ముగ్గురికి టికెట్ లు కావాలని కోరుతున్నట్టు మరో ప్రచారం ఉంది. అయితే.. ఇప్పటికే ఉన్న కాపు నాయకులకు టికెట్లు సర్దు బాటు చేయాల్సి ఉండడంతో.. ముద్రగడ వర్గానికే మూడు నుంచి నాలుగు టికెట్లు ఇచ్చే పరిస్థితి వైసీపికి లేదు. ఇది మరో అవరోధంగా మారింది.
వీటికితోడు.. బలమైన కాపు నాయకుడిగా ముద్రపడడంతో పార్టీపై లేదా.. జిల్లాలో ను ఆయన ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని కూడా పార్టీ అంచనా వేస్తోంది. ఈ కారణంగానే.. ముద్రగడ ఎంట్రీపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. అలాగని ముద్రగడను వైసీపీవదులు కోదని చెబుతుండడం గమనార్హం. పవన్ పోటీ చేసే నియోజకవర్గం పరిస్థితిని అంచనా వేసి.. అక్కడ నుంచి ముద్రగడను నిలబెట్టడం ద్వారా పవన్కు చెక్ పెట్టాలనే వైసీపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది.