తెలంగాణలో ఇది ఎన్నికల సమయం. అవును.. ఉపఎన్నికలు, ఎమ్మెల్సీల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు.. వీటన్నిటి కోసం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అవకాశం వచ్చినప్పుడే పార్టీ సమర్థతను చూపించాలని అన్ని పార్టీలు తాపత్రయపడుతున్నాయి.
ఏ ఎన్నికల్లోనూ ఓడిపోకూడదని.. అన్ని ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అన్ని ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. గ్రేటర్ ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు.
ఈసందర్భంగా ఆయన హైదరాబాద్ లో వరస పర్యటనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనను ఎండగట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయన హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తున్నారు.
ఇటీవల డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా. తాజాగా కిషన్ రెడ్డి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తుండగా… టీఆర్ఎస్ కార్యకర్తలు కాస్త హడావుడి చేశారు. ఆయనకు షాక్ ఇచ్చారు.
ముషీరాబాద్ లో కేంద్ర మంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తుండగా… అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
అయితే.. బీజేపీ పార్టీ నేతలకు పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇతర టీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో.. బీజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాలేదట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.