Agnipath Scheme: అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్షాలు ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్మీ అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకం విషయంలో వెనక్కు తగ్గెదే లే అన్నట్లుగా ముందు వెళుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింద్ శనివారం త్రివిధ దళాల అధికారులతో భేటీ అయి సమీక్ష జరిపారు. అగ్ని పథ్ పథకాన్ని మరో సారి సమర్ధించారు రాజ్ నాథ్ సింద్. తన నివాసంలో మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సైనిక విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కూడా పాల్గొనాల్సి ఉండగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన స్థానంలో వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ బిఎస్ రాజు సమావేశంలో పాల్గొన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అగ్నిపథ్ ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలపై ఈ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ చర్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాజ్ నాథ్ చర్చించినట్లు సమాచారం. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు రెండేళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ పథకాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించామని రాజ్ నాథ్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు అగ్నిపథ్ పథకంపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా సైనిక నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు.
అగ్ని పథ్ పథకం ద్వారా నియమితులయ్యే సిబ్బందికి ఇచ్చే శిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు రాజ్ నాథ్ సింద్. సైనికుల మనోధైర్యాన్ని తగ్గించే చర్యలు న్యాయం కాదని అన్నారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు వయోపరిమితి పెంపు వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది.