ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్కు గాను అనేక దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ను నిర్వహిస్తున్నారు. మొత్తం 150కి పైగా వ్యాక్సిన్లు ఆయా దేశాల్లో ప్రయోగ దశల్లో ఉన్నాయి. అన్నింటికన్నా ముందు ఆక్స్ఫర్ యూనివర్సిటీ రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్కు చెందిన కోవ్యాక్సిన్కు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రజా పంపిణీకి అందుబాటులోకి వచ్చినా.. కేవలం ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోదని, రెండు, మూడు సార్లు లేదా ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందని సైంటిస్టులు అంటున్నారు.
కరోనా వైరస్ సీజనల్గా వచ్చే ఫ్లూ లాంటిదని, అందుకని ఫ్లూకు తీసుకున్నట్లే కరోనా వైరస్కు కూడా సీజనల్గా లేదా ఏడాదికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. అయితే దీనిపై ఇప్పుడప్పుడే చెప్పలేమని అంటున్నారు. సాధారణంగా వ్యాక్సిన్లలో రకరకాలుంటాయి. కొన్ని రకాల వ్యాక్సిన్లు ఆయా వ్యాధుల పట్ల దీర్ఘకాలిక రక్షణను ఇస్తాయి. కానీ కొన్ని వ్యాక్సిన్లు తక్కువ కాలం పాటు పనిచేస్తాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అభివృద్ధి చేయబడుతున్న కరోనా వ్యాక్సిన్లలో చాలా వరకు వ్యాక్సిన్లు తక్కువ కాలం పాటు పనిచేసేవే అయి ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు. అలాంటి వ్యాక్సిన్లను తీసుకుంటే కొన్ని నెలలు లేదా ఏడాది వరకు రక్షణ లభిస్తుందని.. కానీ కరోనా రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ను తీసుకోక తప్పదని అంటున్నారు.
అయితే దీర్ఘకాలం పాటు పనిచేసే వ్యాక్సిన్లను తయారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ఎందుకంటే.. వైరస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులకు లోనవుతుందని, వాటిని గమనించి వ్యాక్సిన్ను తయారు చేయాలని చెబుతున్నారు. అందుకని దీర్గకాలిక వ్యాక్సిన్లు వచ్చే వరకు షార్ట్ టర్మ్ వ్యాక్సిన్లను వాడుతూనే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అయితే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక.. అవి ఎన్ని రోజుల వరకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై వివరాలు తెలియాలంటే.. వ్యాక్సిన్లను అందరూ తీసుకునే వరకు ఆగాల్సిందే..!