మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రాలకు భారీ ఎత్తున ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకనే మద్యంపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రేట్లను పెంచి తమ ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంటాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా లాక్డౌన్ అనంతరం మద్యం ధరలను పెంచుతూ మద్యం అమ్ముకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే లాక్డౌన్ అనంతరం మద్యం అమ్మకాలు కొద్ది రోజుల వరకు బాగానే సాగినా.. ప్రస్తుతం అమ్మకాలు 30 శాతం వరకు పడిపోయాయని అంటున్నారు.
తెలంగాణ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ నాయకుడు డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరోనా ముందు ఉన్న పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం మద్యం అమ్మకాలు 30 శాతం మేర తగ్గాయని వెల్లడించారు. జూలై మొదటి వారంలో హైదరాబాద్లో లాక్డౌన్ మళ్లీ విధిస్తారనే వార్తలు ప్రచారం కావడంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని తెలిపారు. అయితే దేశీయ మద్యంతో పోలిస్తే.. విదేశీ, ప్రీమియం మద్యం కొనేవారి సంఖ్య చాలా తగ్గిందని, దీని వల్ల స్టాక్ను క్లియర్ చేసేందుకు పలు ఆఫర్లను అందజేయాల్సి వస్తుందని మద్యం షాపుల ఓనర్లు చెబుతున్నారు.
మద్యం షాపుల్లో పనిచేసే వారికి లేదా ఓనర్లకు తెలిసిన వారికి ప్రస్తుతం బై నౌ.. పే లేటర్ అనే ఆఫర్ను అందిస్తున్నారు. అంటే.. రూ.4వేల వరకు విలువ చేసే మద్యం కొని 4 దఫాల్లో ఆ మొత్తాన్ని చెల్లించవచ్చన్నమాట. ఇక కొన్ని వైన్ షాపుల యాజమాన్యాలు మద్యం కొన్నవారికి స్టఫ్ కింద ఉచితంగా బాయిల్డ్ కోడిగుడ్లు, చికెన్ స్నాక్స్ను అందిస్తున్నాయి. దీని వల్ల అయినా మద్యం అమ్మకాలు పెరుగుతాయని వారు ఆశిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి మద్యం షాపుల వద్ద పర్మిట్ రూంలకు అనుమతి లేదు. అందువల్ల కూడా మద్యం అమ్మకాలు కొంత మేర తగ్గాయని వైన్ షాపుల యజమానులు అంటున్నారు. కనీసం పర్మిట్ రూంలకు అయినా అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.