ఒక పక్క ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నా, మరో పక్క ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతూ మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు న్యాయ సమీక్ష లో నిలబడటం లేదు. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో సుమారు 65 అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి పలువురు హైకోర్టు ను ఆశ్రయిస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ పర్యవసానంగా ఒకటి రెండు సందర్భాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపి హైకోర్టు గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలో హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘సరైన న్యాయసలహాలు మీకు అందడం లేదు. అదే విషయాన్ని చెబుదామని హైకోర్టుకు పిలిపించామని .. డీజీపీకి హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పుడు న్యాయ సలహాల వల్లే అధికారులు అదే పనిగా హైకోర్టుకు హాజరు కావాల్సి వస్తోందని కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి.
కొద్ది కాలంగా ఏపీ హైకోర్టుల తీర్పులను సైతం పట్టించుకోని వాతావరణం ఉంది. దీనికి కారణం.. లీగల్ టీం ఇస్తున్న సలహాలే కారణమని
అనుకుంటున్నారు. న్యాయ బృందం
విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కనిపిస్తోంది.
ప్రభుత్వాన్ని న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. న్యాయ సలహాదారులు, ఇతర బృందం తీసుకుంటున్న చర్యలు ఉంటున్నాయని అంటున్నారు. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని అందరికీ తెలిసిందే.
సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను లీగల్ టీం.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల విషయంలో అధికారులు అదే పనిగా కోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.
చట్ట విరుద్ధమైన సలహాలతో.. హైకోర్టులోనూ.. సుప్రీం కోర్టులోనూ ప్రభుత్వం పరువు పోయేలా లీగల్ టీం వ్యవహరిస్తోందనీ విమర్శలు వస్తున్నాయి. ఒక్క రంగుల విషయంలోనే కాదు, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు, ఎస్ఈసీ విషయంలోనూ అదే పరిస్థితి.
ప్రభుత్వం పెట్టుకున్న కొందరు న్యాయవాదులు,
న్యాయ నిపుణులు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తూ.. అధికారులకు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని అంటున్నారు.
మూడో సారి డీజీపీకి కోర్టుకు హాజరైన కేసులో… కోర్టు ఒకటి చెబితే ప్రభుత్వ న్యాయవాదులు మరొకటి చేశారట. కనీసం పిటిషన్లు, కౌంటర్లు కూడా
సక్రమంగా వేయడం రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.