టీడీపీ-జనసేన పొత్తును బలంగా ఢీకొట్టేందుకు వైసీపీ అంతే బలంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధానమైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో…ఆరు సీట్లను కాపులకే కేటాయించేసింది. మిగిలిన సామాజిక వర్గాలు టికెట్ కావాలని సీఎం జగన్ను కోరుతున్నా.. కుదరదని ముఖం మీద చెప్పేస్తోంది. రాష్ట్రమంతటా ప్రయోగాలు చేస్తున్న వైసీపీ.. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం కాపులకే పెద్ద పీట వేయడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటున్న సీఎం జగన్.. ఎక్కడికక్కడ సీట్లు మారుస్తున్నారు. ఇప్పటి దాకా 72 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల నేతలు కూడా ఉన్నారు. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కమ్మ, కాపు, రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. కాకినాడ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో ఒక్క కాకినాడ సిటీ మినహా మిగతా ఆరు చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది.
పెద్దాపురం నియోజకవర్గం సీటు మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ టీడీపీ తరపున నిమ్మకాలయ చినరాజప్ప గెలుపొందారు. కాకినాడ పార్లమెంట్ సీటు పరిధిలో దాదాపు 60 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. ఈ సారి కూడా అభ్యర్థుల్ని మాత్రమే మార్చింది తప్ప సామాజిక సమీకరణల్ని మార్చేందుకు ప్రయత్నించలేదు. కాకినాడ జిల్లాలో బీసీ నేతలు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినా వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కాపు ఈక్వేషన్ను కదిలించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే కాపులకే సీటు కేటాయిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదని భావించింది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత…ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు సీట్లను కాపులకే కేటాయించింది. కారణం ఏంటంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. కాకినాడ ఎంపీ సీటుతో పాటు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ లెక్కలు వైసీసీ సరిచూసుకుంటుండడం గమనార్హం.