YSRCP: వైసీపీలో అభ్యర్ధుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వైసీపీ రెండు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మారుస్తూ ఏడో జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు మార్పు జరిగింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత మానుగుంట మహీంధర్ రెడ్డి స్థానంలో కటారి అరవింద యాదవ్ ను నియోజకవర్గ ఇన్ చార్జిగా వైసీపీ నియమించింది. అలానే పర్చూరు ఇన్ చార్జిని మార్పు చేశారు.
సీనియర్ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా తాను చీరాల నుండే పోటీ చేస్తానని ఆమంచి కృష్ణమోహన్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలుస్తొంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా చీరాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమంచి కృష్ణమోహన్.. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి పదివేలకుపైగా ఓట్ల మెజార్టీతో నాడు టీడీపీ అభ్యర్ధి పోతల సునీతపై విజయం సాధించారు. నాడు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎడం బాలాజీ మూడవ స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమంచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీతో వచ్చిన విభేదాల కారణంగా వైసీపీలో చేరారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా చీరాల నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఇక్కడ టీడీపీ నుండి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో చీరాల వైసీపీలో రెండు గ్రూపులు అయ్యాయి. కరణం, ఆమంచి వర్గాల మధ్య తరచు ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు వైసీపీ ఇన్ చార్జిగా పంపింది. తొలుత పర్చూరు నుండి పోటీ చేయడానికి సంసిగ్ధత వ్యక్తం చేసి అక్కడ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ సొంత బలం, బలగం చీరాలనే ఉండటంతో ఇక్కడ నుండి పోటీ చేస్తేనే గెలుపు ఖాయమని భావించారు.
ఈ క్రమంలోనే చీరాల వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ను తప్పించి తనకు ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్టానంపై ఆమంచి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పర్చూరు నుండి పోటీ చేయడానికి ఆమంచి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో పర్చురుకు యడం బాలాజీని సమన్వయకర్తగా నియమించింది.
తాజా జాబితాలో రెండు నియోజకవర్గాలకు మాత్రమే మార్పులు చేర్పులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. ఆమంచి కృష్ణమోహన్ కు ఏ సీటు ఇస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. తాను కోరుకున్నట్లు చీరాల ఇస్తారా లేక వేరే నియోజకవర్గానికి పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఆమంచికి పార్టీ అధిష్టానం చీరాల ఇన్ చార్జిగా ప్రకటించకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా మరో సారి ఆమంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడాలి ఏమి జరుగుతందో.
పర్చూరు ఇన్ చార్జిగా నియమితులైన యడం బాలాజీ 2014 ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. చీరాలలో టీడీపీ అభ్యర్ధి తరుపున ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో టీడీపీ యడం బాలాజీని చీరాల టీడీపీ ఇన్ చార్జిగా నియమించింది. ఇన్ చార్జిగా ఆయన యాక్టివ్ గా పని చేయకపోవడంతో టీడీపీ ఆయనను తప్పించి ఎంఎం కొండయ్యకు టీడీపీ ఇచ్చింది. దీంతో యడం బాలాజీ రాజకీయాల నుండి దూరంగా వెళ్లిపోయారు. గత మూడు నాలుగు నెలల నుండి చీరాల నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. ఆకస్మికంగా ఆయనకు వైసీపీ పర్చూరు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ.
Chandrababu: బాబులో ఈ మార్పునకు కారణం కేసిఆర్యేనా..?