ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వేకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ముచ్చటించిన వైఎస్ జగన్ వరద బాధిత ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశించారు.
ఖర్చుకు వెనకాడ వద్దని, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ఏరియల్ సర్వేలో వైఎస్ జగన్ వెంట హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. వరదల వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. అధికారులు ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.