నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి రాకపోవటం కూడా మంచే చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.తగిన సమయం దొరకడంతో రోజా నగరి నియోజక వర్గాన్ని పూర్తిగా తన గుప్పిట పెట్టుకునే ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు.
అసలు నియోజకవర్గంలో 2024 ఎన్నికల నాటికి తనకు పోటీయే లేకుండా కూడా చేసుకునే ఎత్తుగడలను రోజా అమలు చేస్తున్నారట.టిడిపి ఇక నగరిలో కోలుకోలేని రీతిలో రోజా దెబ్బ కొడుతున్నారట.ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండుసార్లు వరస విజయాలను నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గాలి ముద్దు కృష్ణమనాయుడిపై నెగ్గిన ఆర్కే రోజా, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గాలి తనయుడు భాను ప్రకాష్ పై విజయం సాధించారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణంతో నగరి నియోజకవర్గంలో టీడీపీకి నేత అంటూ లేకుండా పోయారు. క్యాడర్ ను పట్టించుకునే వారు లేరు.
పైగా గాలి ముద్దు కృష్ణంనాయుడు కుటుంబం లో అంతర్గత విభేదాలు ఉన్నాయి.ఈనేపధ్యంలో ఆ కుటుంబం నగరిలో రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేదు దీనిని ఆర్కే రోజా అడ్వాంటేజీగా మార్చుకుంటున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ క్యాడర్ కు కండువాలు కప్పే పనిలో పడ్డారు. ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లిందంటున్నారు.ఏదేమైనా నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు రోజురోజుకూ గ్రిప్ పెంచుకుంటూ ఉంది. టీడీపీ క్యాడర్ ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు ఆర్కేరోజా. ఆర్కే రోజాకు ఒకరకంగా మంత్రి పదవి రాకపోవడమే మంచిదయిందంటున్నారు ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు.
మంత్రి పదవి వచ్చి ఉంటే నియోజకవర్గం గురించి పట్టించుకునే సమయం ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా నగరి మీదనే దృష్టి పెడుతుండటంతో టిడిపిని దెబ్బకొట్టే అవకాశం చిక్కినట్లయిందంటున్నారు.అంతా మన మంచికే అని పెద్దలు ఊరికే అన్నారా? జగనన్న తన ప్రియమైన చెల్లికి ఈవిధంగా కూడా మేలు చేశారన్నమాట.అయినా కాలం కలిసి వస్తున్నప్పుడు ఇలాగే అన్ని అనుకూలంగా మారుతుంటాయి!ఏదేమైనా రోజా అదృష్టవంతురాలే