ముందు నుండి తన ప్రభుత్వంలో ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెద్ద తలనొప్పిగా మారటంతో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రణాళికబద్ధంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో క్యాన్సిల్ చేసినట్లు జగన్ ఆరోపించడం అందరికీ తెలిసిందే. దీంతో ఇలాంటి వ్యక్తి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయటం జగన్ ఆ టైంలో తట్టుకోలేకపోయారు.
దీంతో ఆ తర్వాత ఆయన పదవి దానంతట అదే ఊడిపోయేలా ప్రభుత్వం సరికొత్త ఆర్డినెన్స్ తీసుకురావటంతో నిమ్మగడ్డ పదవి కోల్పోవడం జరిగింది. అయితే ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానానికి వెళ్లి….మళ్లీ తన పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేసి దాదాపు మళ్లీ పదవి దక్కించుకునేలా రెడీ అయ్యారు. అయితే ముందు నుండి న్యాయస్థానం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి రాజకీయ నాయకులతో సంబంధం ఏమిటి అని వైసీపీ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉంది.
ఇలాంటి సమయంలో జూన్ 13 వ తారీకు పార్క్ హయత్ హోటల్ లో హైదరాబాద్ నగరంలో కామినేని శ్రీనివాస్ మరియు సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అవ్వటం ఆ వీడియో ఫుటేజ్ లు ఇటీవల బయటపడటం తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో బయటపడిన ఈ వీడియో ఫుటేజీలను ఆధారం చేసుకుని వైయస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఆయన పదవి ఊడిపోయేలా జగన్ సరైన స్కెచ్ తో ఢిల్లీ ప్రయాణం చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయిన సుజనాచౌదరి మరియు కామినేని శ్రీనివాస్ ఇద్దరు బీజేపీ నేతలు కావడంతో ఈ విషయంలో ఢిల్లీ బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.