YS Sharmila: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న మారిపోయారని అన్నారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారని షర్మిల విమర్శించారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. మద్యం ఏరులై పాలించాడని విమర్శించారని అన్నారు.
ఇవేళ ఇడుపులపాయలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఇవేళ ఆయిదు లోక్ సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలతో కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా విడుదల అయ్యిందనీ, మరో ఒకటి రెండు రోజుల్లో తుది జాబితా విడుదల అవుతుందని చెప్పారు. ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. ఈ రోజు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడనీ, కాంగ్రెస్ తరుపున వైఎస్సార్ పది సార్లు ఎన్నికల్లో గెలిచాడన్నారు.
పదవులు ఉన్నా లేకున్నా వైఎస్ఆర్ పార్టీలో నిలబడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగారనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తేవడంతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటునకు తనవంతు సహకారం అందించారన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీనే మంచిది అని నమ్మిన వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యే వారని అన్నారు.
నాన్న ఆశయం కోసం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని మరో సారి వెల్లడించారు షర్మిల. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జగన్, బాబు ఏనాడూ పని చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని అన్నారు. రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉండటానికి కారణం బాబు, జగన్ లేనని అన్నారు. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదని అన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని షర్మిల అన్నారు.
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా తాను బరిలో నిలుస్తున్నట్లు షర్మిల తెలిపారు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడికి జగన్ .. కడప ఎంపీ టీకెట్ ఇచ్చారని అన్నారు. కడప పార్లమెంట్ కు తాను పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసునని అన్నారు. తాను పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుంది అని తెలుసనీ అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయమన్నారు.
సీఎం జగన్ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడని విమర్శించారు. కడప ఎంపీ అభ్యర్థిగా వివేకా హత్య కేసు నిందితుడిని ప్రకటించడం తట్టుకోలేక పోయానని అన్నారు. హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవని, అధికారం వాడుకొని వాళ్ళనే జగన్ రక్షిస్తున్నాడని ఆరోపించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడన్నారు. మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానని అన్నారు. వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారన్నారు. ఈ విషయం మాకు చాలా ఆలస్యంగా అర్థం అయిందన్నారు.
సాక్షి చానెల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందన్నారు. హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారన్నారు. వైఎస్సార్, వివేకా రామ లక్ష్మణుడి లా ఉండేవారని గుర్తు చేశారు. వివేకా ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని.. అప్పుడు నాకు అర్థం కాలేదన్నారు. నన్ను ఎందుకు ఎంపీగా ఉండమని అడిగారో.. ఇవ్వాళ అర్థం అయ్యిందన్నారు. సునీత న్యాయం కోసం గడప గడపకి తిరుగుతుందన్నారు. న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదని అన్నారు.
AP Election 2024: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు