ysrcp ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి .ఉపాధ్యాయ సంఘాలకే ఎన్నికలు వదిలెయ్యలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలు జరగనున్న కృష్ణా గుంటూరు పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల నేతలను పిలిపించిన సీఎం జగన్ తన మనసులోని మాటను వారికి చెప్పి పంపారంటున్నారు….వివరాల్లోకి వెళితే ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది.
ఉభయగోదావరి జిల్లాలకి కలిపి ఒకటి ,కృష్ణా గుంటూరు జిల్లాలకు కలిపి ఒకటి మొత్తం రెండు స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు స్థానాలకు ఉపాధ్యాయ సంఘాల నుండి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.పైగా కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్సీ ఎ ఎస్ రామకృష్ణ మళ్లీ పోటీకి దిగారు.ఉభయగోదావరి జిల్లాల్లో యుటిఎఫ్ అభ్యర్థి బలంగా ఉన్నారు. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపై అధికార పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని సీఎం జగన్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నాన్ పొలిటికల్గా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలుగచేసుకోవడం సరికాదని భావించిన సీఎం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలను పిలిచి.. వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.మద్దతు
ysrcp : యుటిఎఫ్ కి మద్దతు?
ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. పరోక్షంగా ఎవరికైనా మద్దతు ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు స్కూళ్లలో మౌళిక వసతులు కల్పించిన విషయాన్ని టీచర్లకు వివరించాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే సీపీఎం అనుబంధ సంస్థ అయిన యూటీఎఫ్ అభ్యర్థులకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.
ఎందుకని వెనుకంజ?
ఈసారి టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎందుకని వైసిపి పోటీ చేయడానికి వెనుకంజ వేస్తుందన్నది చర్చనీయాంశమైంది.గతంలో రాయలసీమ జిల్లాల్లో వెన్నపూస గోపాలరెడ్డి అనే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని వైసిపి బలపర్చగా ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఈ సారి టీచరు స్థానాలు టీచర్లకే వదిలేయాలన్న వైసిపి వాదన కొంచెం వింతగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ కి అనుకూల వాతావరణం లేనందునే జగన్ అన్నీ ఆలోచించి అసలు పోటీ నుండే వైసిపి తప్పుకునేలా వ్యూహం పన్నారు అంటున్నారు.ఏదేమైనా అధికార పార్టీయే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేకపోవటం ఆసక్తికరమైన పరిణామం.