YSRCP: రాజకీయాల్లో ఉన్న నాయకుడికి పదవి, పరపతి ముఖ్యం. పదవి పోయినా, పరపతి తగ్గినా తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతుంటారు. ఆధిపత్యానికి ఎసరు వస్తుంది అంటే వారిలో ఆందోళన రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలానే తయారైందని అంటున్నారు.
అయిదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి మాట ఇప్పుడు పార్టీలో చెల్లుబాటు కావడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దగ్గరి బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స్వయాన బావ బావమరిదిలు. కానీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో విభేదాలు ఉన్నాయి. మంత్రిగా ఉన్నంత కాలం బాలినేని హావానే కొనసాగింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు.
ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులు కావడంతో పార్టీలో నెంబర్ టూ పొజిషన్ కు వచ్చారు. ఇప్పుడు వైవీ మాట పార్టీలో చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరి ఆధిపత్యం కొనసాగుతూ ఉండదు. రోజులు మారుతున్నట్లుగానే నాయకులకు టైమ్ వస్తుంటుంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించినప్పటి నుండి పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తరచు బాలినేని అలకబూని హైదరాబాద్ వెళ్లడం, పార్టీ పెద్దలు బుజ్జగింపు చర్చలు జరపడం, మళ్లీ ఒంగోలులో బలప్రదర్శన చేయడం జిల్లాలో రాజకీయ వర్గాలు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం బాలినేని తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైయ్యారు. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధి గా అధిష్టానం ఖరారు చేస్తుందని పార్టీ పెద్దలు బాలినేనికి చెప్పారు.
అయితే ఒంగోలులో పార్టీ అంతా తన కనుసన్నల్లోనే ఉండాలని బాలినేని భావించారు. కానీ చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడంతో బాలినేని మళ్లీ అలకబూని హైదరాబాద్ చెక్కేశారు. గతంలో పలు మార్లు బాలినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం, ఆయన ఆ ప్రచారాలను ఖండించడం జరిగింది. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తన సన్నిహితుల వద్ద రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. పార్లమెంట్ అభ్యర్ధిగా, రీజినల్ ఇన్ చార్జిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జిల్లాలో అడుగు పెడితే ఇన్నాళ్లుగా పార్టీలో నడిచిన తన అధిపత్యానికి గండిపడుతుందని బాలినేని ఆందోళన చెందుతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హైదరాబాద్ లో బాలినేని నివాసానికి వెళ్లి సమావేశమైయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్ధులకు సహకరించాలని కోరినట్లుగా తెలుస్తొంది. అయితే చెవిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత తన కీలక అనుచరులతో సమావేశమైన బాలినేని.. ఆ తర్వాత పార్టీ అధిష్టానం వద్దకు కీలక ప్రతిపాదన పంపినట్లు గా తెలుస్తొంది. జిల్లాలో తన ఆధిపత్యం తగ్గకుండా ఉండాలంటే తానే ఒంగోలు లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తున్నారుట.
ఈ ప్రతిపాదనను పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ద్వారా పార్టీ హైకమాండ్ కు తెలియజేసినట్లుగా సమాచారం. బాలినేని ప్రతిపాదనపై సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే బాలినేని ఎపిసోడ్ కు ఎండ్ కార్డు ఎలా పడుతుంది అనేది ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది.
YSRCP: టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ..?