YCP: గుమ్మనూరు జయరాం .. వరుసగా రెండు సార్లు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా గుర్తింపు ఉంది. ఆర్ధికంగానూ బలమైన నేత. ఆ కారణంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ నేతకు మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ రెండో సారి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన టికెట్ ను వేరే వాళ్లకు ఇవ్వడంతో ఖంగుతిన్నారు.
కర్ణాటకలో ప్రజాప్రతినిధిగా ఉన్న తన బంధువుతో సీఎం జగన్ కు సిఫార్సు చేయించుకోవడంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కర్నూల్ లోక్ సభకు పోటీ చేయాలని చెప్పారు. కర్నూల్ లోక్ సభ అభ్యర్ధిత్వం ఖరారు చేశారు. కానీ ఆయనకు మాత్రం లోక్ సభకు పోటీ చేయడానికి ఇష్టం లేదన్నట్లుగా తెలుస్తొంది. కర్నూల్ లోక్ సభ ఇన్ చార్జిగా ప్రకటించిన నాటి నుండి అందుబాటులో లేకుండా పోయారు జయరాం. ఎక్కువ రోజులు బెంగళూరు, బళ్లారిలోనే ఉంటున్నారని సమాచారం. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారు. కానీ కర్నూల్ లోక్ సభ నుండి పోటీ చేస్తారో లేదో తెలియజేయలేదు.
మరో పక్క జయరాం పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలియడంతో ప్రత్యర్ధి పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జయరాం..2009 లో ప్రజా రాజ్యం తరపున అలూరు అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2011 లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు వైసీపీ ఆ స్థానానికి ఇన్ చార్జిగా విరూపాక్షిని నియమించింది. అదే నియోజకవర్గం నుండి మరో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని జయరాం భావిస్తున్నారు. వైసీపీ అధిష్టానం మాత్రం ససేమిరా అంటోంది.
అభ్యర్ధి ప్రకటన తర్వాత నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోయారు జయరాం. ఆయన కర్ణాటక రాష్ట్రంలో బళ్లారిలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తొంది. ఇటీవల మంత్రి వర్గ సమావేశానకి హజరైన జయరాం మళ్లీ అందుబాటులో లేకుండా పోయారు. ఆలూరులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి జయరాం హజరు కాలేదు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో కర్నూల్ మేయర్ రామయ్యను పార్లమెంట్ అభ్యర్ధిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది.
జయరాంకు కర్ణాటక మంత్రి నాగేంద్ర సమీప బంధువు. మంత్రి నాగేంద్ర ద్వారా అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో జయరాం సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే కర్నూలు జిల్లా బాధ్యతలతో పాటు అలూరు టికెట్ కేటాయించడం ఖాయమని తెలుస్తొంది. అయితే వాల్మీకి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న అయిదు సీట్లు కర్నూలు, అనంతపురం జిల్లాలో కేటాయించాలని కోరారని అంటున్నారు.
ఇటు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతూనే మరో పక్క టీడీపీతోనూ టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. టీడీపీ మాత్రం ఆలూరు కాకుండా పక్క నియోజకవర్గం ఇవ్వడానికి సంసిగ్దత వ్యక్తం చేసిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో జయరాం వైసీపీకి షాక్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళతారా..? కర్నూల్ ఎంపీ టికెట్ తీసుకుని సర్దుకుపోతారా..? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
YSRCP: బాలినేని కొత్త ప్రతిపాదన .. సీఎం జగన్ ఏమంటారో..?