YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిన్న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు తప్పుబడుతూ ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ముద్రగడ ఘాటుగా స్పందించారు. శనివారం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడారు.
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూనే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్దమని ప్రకటించారు ముద్రగడ. తనపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని అన్నారు. తాను బేషరతుగానే వైసీపీలో చేరడం జరిగిందన్నారు. ప్రజలకు సేవల చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నానని స్పష్టం చేశారు.
కాపులు, దళితుల కోసం తాను ఉద్యమించానని చెప్పారు. దళితుల బిక్షతోనే తాను ఈ స్థితికి వచ్చినట్లు తెలిపారు. కిర్లంపూడి సర్పంచ్ పదవులు వస్తే .. బీసీని గెలిపించానని తెలిపారు. ఏ ఉద్యమం చేసినా బీసీలు, దళితులే ముందుండి నడిపించారని అన్నారు. నా వర్గాన్ని, నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలని, నాకు చెప్పడానికి ఆయన ఎవరు అని ముద్రగడ ప్రశ్నించారు.
చంద్రబాబు అయిదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడని అన్నారు. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ సినిమాల్లో హీరో కావచ్చు, రాజకీయాల్లో మాత్రం నేనే హీరోను అని ముద్రగడ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోనూ, సినిమా ఫీల్డ్ లోనూ నేనే ముందున్నాను, మీరా నాకు పాఠాలు నేర్పేది అంటూ జనసేన కార్యకర్తలపై ముద్రగడ మండిపడ్డారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినని, కానీ కొన్ని శక్తులు సీఎం జగన్ కు దూరం చేశాయని అన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తాను సిద్దమని ముద్రగడ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరడంతో పవన్ పై పిఠాపురం నుండి పోటీకి దింపుతారా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో 2009 ఎన్నికల్లో పిఠాపురం నుండి ముద్రగడ పోటీ చేశారు. ముద్రగడ పార్టీ లో చేరడానికి రెండు రోజుల ముందు అక్కడ వైసీపీ ఇన్ చార్జిగా నియమితురాలైన ఎంపీ వంగా గీతను తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. తాజాగా ముద్రగడ కూడా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పడంతో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
Arvind kejrival: ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ .. బెయిల్ మంజూరు