ఎంతో మంది పోటీలో ఉన్నారు. ఉద్ధండులైన నాయకులు.. వరుస విజయాలు దక్కించుకున్న నేతలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తూ.. టికెట్లు ఇస్తున్నారు. కొత్తవారికి దాదాపు టికెట్లు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు వెనుకాడారు. ఇలాంటి పరిస్థితి లో యువ నేత భాష్యం ప్రవీణ్ టికెట్ సంపాదించుకున్నారు. ఇది ఒకరకంగా.. ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నారన్న సంకేతాలు ఇచ్చేసింది.
ఎందుకంటే.. చంద్రబాబు స్వయంగా చెప్పినట్టు అనేక సర్వేలు చేయించారు. ఐవీఆర్ ఎస్ ద్వారా తానే స్వయంగా నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో భాష్యం ప్రవీణ్ను ఎంపిక చేశా రంటే.. ఆయన విషయంలో ప్రజల నుంచి ఎంతో పాజిటివ్ టాక్ వచ్చి ఉంటుందనే విషయం స్పష్టమవు తోంది. పైగా రాజకీయాలకు కొత్త కావడంతో ఆయనను ఎంపిక చేసేందుకు చంద్రబాబు చాలానే శ్రమించి ఉంటారు. అన్ని రకాల వడపోతల తర్వాత.. భాష్యంను ఎంపిక చేశారంటే భాష్యం విషయంలో ప్రజల్లో, పార్టీ కేడర్లో ఎంత సానుకూలత ఉందో తెలుస్తోంది.
ఇక, భాష్యం ప్రవీణ్కు కేటాయించిన టికెట్ను పరిశీలిస్తే.. ఆయనకు కీలకమైన పెదకూరపాడు టికెట్ను ఇచ్చారు. ఇది రాజధాని అమరావతిలో ఉన్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి గెలిచే వారికి రైతుల మద్దతు అవసరం. ఈ కోణంలో చూసుకున్నా.. భాష్యం ప్రవీణ్.. గతంలో రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. వారికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చి.. తాను కూడా పాదయాత్రలోనూ పాల్గొన్నారు. సో.. రైతుల నుంచి కూడా ప్రవీణ్కు మద్దతు మామూలుగా లేదు.
ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. పార్టీకి ప్రవీణ్ ఎన్నోసేవలు చేస్తున్నారు. చేశారు కూడా. యువతకు అండగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సేవ చేసేందుకు ప్రత్యేకంగా ప్రవీణ్ సేన పేరుతో కొందరు యువకులను నియమించుకున్నారు. వీరికి బైకులు ఇచ్చి.. గ్రామీణ ప్రాంతాలకు పంపించి.. అక్కడివారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇదంతా ఇప్పటి వరకు చిలకలూరి పేటపై చేశారు. కానీ, ఇప్పుడు నియోజకవర్గం మారడంతో ఆయన తక్షణమే పెదకూర పాడు నుంచి తన రాజకీయాలను పరుగులు పెట్టించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏదేమైనా గుంటూరు జిల్లా రాజకీయ యువనికపై భాష్యం ప్రవీణ్ శకం ఆరంభం కానుంది.