5 States Elections: దేశం మొత్తం ఎదురు చూసిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి.. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేకపోయింది.. బీజేపీ యూపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో అనుకోని విజయంతో ఊపుమీదుంది.. ఆప్ ఢిల్లీ పక్కనే ఉన్న పంజాబ్ లో చీపురు పెట్టి ఇతర పార్టీలను ఊడ్చేసింది.. మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పరిస్థితే ఇప్పుడు ఊహించని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. “దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అంటూ నూతన ప్రసాద్ పదే పదే చెప్పే సినిమా డైలాగు ఇప్పుడు “కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది” అనే స్థితికి వెళ్ళింది. చేతిలో ఉన్న పంజాబ్ కోల్పోవడమే కాకుండా.. యూపీలో కనీసం రెండంకెల స్కోరు చేయకపోవడం, గోవా, మణిపూర్ లో కనీసం అధికార పీఠం చేజిక్కించుకోకపోవడం ఆ పార్టీకి అతి పెద్ద దెబ్బ. వరుసగా ఎదురవుతున్న ఈ పరాజయాలు కాంగ్రెస్ భవిష్యత్తుని గంగలో కలిపేస్తున్నాయి. కాంగ్రెస్ కి బెంగ మిగులుస్తున్నాయి.. నిజానికి దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ.. సరైన ప్రత్యామ్నాయం లేక.. కాంగ్రెస్ చేతగాక, చేవలేక.. జనం నమ్మకం లేక బీజేపీ ఇలా ఇంకా ఇంకా పాతుకుపోతుంది.
5 States Elections: 2017లో ఇలా.. ఇప్పుడు ఇలా..!
2017లో జరిగిన ఎన్నికలనే తీసుకుంటే.. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ నాడు 77 గెలుచుకుంది. నేడు కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. అవి కూడా పూర్తిస్థాయి ఫలితాలు వస్తే తగ్గే.., పెరిగే అవకాశాలున్నాయి..! కానీ 77 కీ 18 కీ చాలా తేడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటంలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో భాగస్వామి కాలేదు. అదే ఉద్యమంలో ఆప్ రైతులతో కలిసి పోరాడింది. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తూంది..!
* 2017లో గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 18 సీట్లు గెలుచుకుంది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 11 స్థానాలకే పరిమితమయింది. అతి చిన్న రాష్ట్రంలో కూడా రాజకీయమ్ చేయలేక.., స్థానాలను నిలబెట్టుకోలేకపోయింది.. ఇక్కడ బీజేపీకి అధికార పీఠం చెరువవుతుంది.. * ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ 2017లో 11 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 21 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది.
యూపీలో కాంగ్రెస్ చారిత్రిక తప్పిదాలు..!
కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం చక్రం తిప్పిన పార్టీ.. దశాబ్దాల తరబడి ఏలిన పార్టీ. అటువంటిది దేశ రాజకీయాల్లో గుండెకాయ లాంటి ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కనీసం రెండంకెల సీట్లు గెలవలేకపోవడం కాంగ్రెస్ కి ఘోర పరాభవమే.. 2017 లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే అదే స్థానాలు వచ్చాయనే సంతృప్తి ఉంటె ఉండొచ్చు.., కానీ ఒకప్పుడు యూపీలో కాంగ్రెస్ చక్రం తిప్పింది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలు, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకుని కాస్తయినా పరువు నిలుపుకుంది. కానీ గడిచిన అయిదేళ్ల నుండి రెండంకెల స్కోరు లేక పరువు పోగొట్టుకుంటుంది..! దీనికి అనేక కారణాలున్నాయి. నాయకత్వ లోపం అతి పెద్ద సమస్యగా ఉండగా, ఉన్న నాయకుల్లో కూడా వివాదాలు, గొడవలు మరో కారణంగా కనిపిస్తున్నాయి. బలం లేని చోట అందరూ కలిసి పని చేయాలి.. గెలవాలి అనే తపన చూపించకుండా.. గెలిస్తే ఏమిటీ..!? గెలిస్తే ఎవరు సీఎం..!? ముందే తేల్చండి అనుకుంటూ కాంగ్రెస్ నేతలు వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేసారు. ఇదే సందర్భంలో జాతీయ స్థాయి నాయకత్వం కూడా కాంగ్రెస్ కి పెద్ద లోపంగా మారింది. రాహుల్ పై నమ్మకం లేకపోవడం.., ప్రియాంక కూడా రాజకీయంగా ముదరకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు బలహీనమయ్యారు. అలా దిక్కులేక, చుక్కాని లేని నావలా కాంగ్రెస్ పరిస్థితి మారింది..!