అమరావతి: అధికారమే ధ్యేయంగా బ్రతికే చంద్రబాబును ఓటమి భయం పిచ్చివాడిని చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఎన్నికల సంఘం, ప్రధాని మోదిపై చేసిన విమర్శలకు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
ట్విట్టర్ వేదికగా చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కన్నా ట్వీట్ పోస్టు చేశారు.
‘రాజ్యాంగ సంస్థలపై విమర్శలు చేసేది నువ్వు, నీ పచ్చ మీడియా మాత్రమే. దేశంలో వ్యవస్థలకు పట్టిన చెద పురుగువి నువ్వు, నిలకడ లేని మాట, నిజాయితీ లేని మనస్థత్వం, ధర్మం లేని పాలన, ఓర్వలేని స్వభావం. ఇది నీ మానసిక స్థితి‘ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా విమర్శ చేశారు.
చంద్రబాబు పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా కోలుకోలేని పతనావస్థకు చేరిందని కన్నా ఆరోపించారు. విభజన చట్టంలో పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా హక్కు కల్పిస్తే దానిపై చంద్రబాబు ఏరోజైనా మాట్లాడారా అని కన్నా ప్రశ్నించారు. అక్కడ రాజకీయ కుట్రలు చేసి అర్థరాత్రి కరకట్టకు పారిపోయి వచ్చి మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నాడంటూ కన్నా విమర్శించారు.