‘బ్యాంకుల ముందు చెత్త’.. ఆంధ్ర ప్రదేశ్ కాదు.. దేశం మొత్తం విస్తుపోయిన ఘటన ఇది. ఈనెల 24న కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటనపై ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని ఓ ఆరోపణ ఉంది. అయితే.. ఇందుకు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు వెళ్లాల్సినవి విజ్ఞప్తులు. కానీ.. జరిగింది వేరు. ఆదమరిస్తే ఎగిసిపడిన కెరటం సముద్రంలోకి లాక్కెళ్లిపోయినట్టు.. నిరసన వ్యక్తం చేసిన తీరు ఇంత పని చేస్తుందని బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు. ఇప్పుడదే జరిగింది.. లబ్దిదారులకు రుణాలు ఇప్పించడం దేవుడెరుగు.. ఏకంగా మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ కు దారి తీసింది.
బ్యాంకులపై ఈ తరహా నిరసనా..?
జగనన్న తోడు, జగనన్న ఆసరా.. వంటి పథకాలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వడం లేదని ప్రభుత్వం వరకూ వెళ్లిన మాట నిజమే. బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కోరడమూ నిజమే. కానీ.. అంతర్గతంగా ప్రభుత్వ ఉన్నత అధికారుల నుంచే బ్యాంకుల ముందు నిరసన చేయాలని.. అది కూడా చెత్త వేసి నిరసన తెలపాలని ఆదేశాలు వచ్చాయని భోగట్టా. అందుకు అనుగుణంగానే కమిషనర్ నర్మగర్భ ఆదేశాల మేరకు సిబ్బంది… కొందరు ఈ చెత్త వేశారు. దీనివల్ల వచ్చే మచ్చ ప్రభుత్వానికే. పదుల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పొద్దున్న బ్యాంకులోకి వెళ్తే.. బయటకు వచ్చేది సాయంత్రమే. కానీ.. ఈలోపు వందల్లో కస్టమర్లు బ్యాంకులకు వస్తారు. ఇబ్బంది పడేది ప్రజలే. ఆ సెగ తాకేది ప్రభుత్వానికే.
పోయింది సీఎం జగన్ పరువే..!
బ్యంకు వాళ్లు ‘ఒత్తిడితో రుణాలిచ్చేస్తారులే’ అనుకుంటే ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం.. రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన చీవాట్లు తినడం జరిగింది. ఇప్పుడు పోయిన పరువు ఎవరిది? సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న ప్రభుత్వం.. ఇటువంటి ఘటనల ద్వారా చెడ్డ పేరే తెచ్చుకుంటుంది. ప్రజలందరూ ఇలా చేయరు.. కేవలం వైసీపీ సానుభూతిపరులే ఈ పని చేస్తారు. దీనికి ప్రభుత్వంలోని కొందరు అధికారుల అండ ఉండకుండా పోదు. అతడు సినిమాలో ప్రకాశ్ రాజ్ అన్నట్టు.. ‘ఈ చిన్న లాజిక్’ మిస్ అవుతోంది ప్రభుత్వం. ఏరికోరి ఇటువంటి సంఘటనలు కొని తెచ్చుకుని ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారో.. ఎలా సమర్ధించుకుంటారో సీఎం జగన్ ఆలోచించుకోవాలి.