(తిరుపతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మంత్రి కొడాలి నాని ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు. బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై అనుచితంగా వ్యాఖ్యలు చేసి హింధువుల మనోభావాలను దెబ్బతీసినందున మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుండి తొలగించాలని బిజెపి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపత్యంలో బిజెపిపై మరో సారి ఫైర్ అయ్యారు కొడాలి నాని.
తిరుమల బ్రహ్మోత్సవాలలో ముఖ్యమంత్ర వైఎస్ జగన్తో కలిసి పాల్గొనేందుకు బుధవారం ఆయన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఇక్కడకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజెపి పార్టీ నాయకులకు జగన్కు సలహాలు ఇచ్చే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. సిఎం జగన్ ను డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్న నాయకులు ప్రధాన మంత్రి మోదిని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమని చెప్పండి అని సలహా ఇచ్చారు. పిఎం మోడీ, యుపి సిఎం యోగి మాత్రం ఒంటరిగానే ఆలయాలకు వెళ్లారు, జగన్ మాత్రం కుటుంబ సమేతంగా ఆలయానికి రావాలా అని ప్రశ్నించారు కొడాలి నాని.
మంత్రివర్గం నుండి ఎవరిని తీసేయాలనే విషయాలను బీజెపీ నేతలు చెప్పడం ఎమిటని ప్రశ్నించారు. పది మందిని తీసుకువెళ్లి అమిత్ షా, కిషన్ రెడ్డిలను తొలగించాలంటే తొలగిస్తారా అని ప్రశ్నించారు కొడాలి నాని. ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని కొడాలి బీజెపీ నేతలకు హితవు పలికారు.