(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ఎటువంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
కరోనా వ్యాధి ప్రబలుతున్న కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించిన వెంటనే సి ఎం జగన్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎన్నికల అధికారి తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా నియమితులు అయ్యారని, ఆయన సామజిక వర్గానికే చెందిన రమేష్ కుమార్ చంద్రబాబు సూచనల మేరకే ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కనీసం చర్చించకుండా కీలక నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, కొరోనా ప్రభావం రాష్ట్రంలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. సి ఎం ఫిర్యాదు పై గవర్నర్ ను కలిసి వివరణ ఇచ్చిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మంగళవారం సిఎస్ కు లేఖ రాశారు. మరో పక్క ఎన్నికల కమిషనర్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్ ఈ సి నిర్ణయంపై సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణ కు వచ్చే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఆమోదం పొందిన సి ఆర్ డి ఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుల ను శాసన మండలి ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీ కి పంపడంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోని అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల కమిషనర్ విషయంలో ఇలాంటి స్టెప్ తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. అధికార పార్టీ నేతల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషనర్ కొనసాగటానికి జగన్ అంగీకరిస్తారా?, అయన పై కేంద్రానికి పిర్యాదు చేస్తారా? లేక అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించి గవర్నర్ కు పంపుతారా? ఏమి చేయనున్నారు? . ఒక పక్క ప్రభుత్వ సూచనను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు అదే విధంగా ఎన్నికల కమిషనర్ ఆదేశాలను (అధికారుల బదిలీ ) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య ఇటువంటి వివాదం గతంలో ఎప్పుడు జరగలేదు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై పూర్వ ఎన్నికల అధికారి రమాకాంతరెడ్డి రెడ్డి తో సిఎం జగన్ సమావేశమై చర్చించారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎన్నికల వాయిదా నిర్ణయానికి ముందు ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేసిన ప్రతిపక్షాలు నేడు కమిషనర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.