బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నాకి బాగా కాలింది. ఆ చురక పెట్టింది విజయసాయిరెడ్డి. అదేం మామూలు చురక కాదు, ఆయన బిజెపి నిధులు కాజేసేసారని, టిడిపి నుండి రూ. 20 కోట్లు తీసుకున్నారని. అందుకే కాలిన కన్నా ఎందుకు ఊరకుంటారు? విజయసాయిరెడ్డి తో తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యారు. నేరుగా పరువు నష్టం దావా వేశారు. నోటీసులు పంపించారు. సమాధానం చెప్పకుంటే, సరైన రిప్లై రాకుంటే కోర్టుకి రావాల్సిందే అంటూ తన దూకుడుని పెంచారు.
కరోనా వేళన… బిజెపి × వైసిపి
ఏపీ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ.. వైరస్ పరీక్షలకు వాడుతున్న ర్యాపిడ్ కిట్ల వ్యవహారంలో ఆరోపణలు చేసిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై అనుచిత వ్యాఖ్యలకు దిగిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుకున పడ్డారు. ఏపీ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్లు పెట్టడం కలకలం రేపింది. దీని పై స్పందించిన సాయిరెడ్డి టీడీపీ నుంచి 20 కోట్లు తీసుకుని వైసీపీ సర్కారు పై బురద జల్లుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తన లాయర్ ద్వారా విజయ్ సాయిరెడ్డి కి పరువు నష్టం దావా నోటీసులు పంపారు.
బీజేపీ పెద్దల దృష్టిలో కూడా…!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనను ఉద్దేశించిన చేసిన పార్టీ హైకమాండ్ పెద్దలకు వివరణ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. తన తప్పేమీ లేనందున పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నట్లు సమాచారం కూడా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ర్యాపిడ్ కిట్ల పై వైసీపీ ప్రభుత్వంపై తమ పార్టీ నేత కన్నా వ్యాఖ్యలు, ఎంపీ విజయ్ సాయిరెడ్డి ప్రతి విమర్శ లపై ఇప్పటికే అధిష్టానం ఆరా తీసింది. దీని పై కన్నాను మందలించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నా పరువు నష్టం నోటీసులు కలకలం రేపుతున్నాయి.