అమరావతి : ఏపి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఇటీవల న్యాయ వ్యవస్థపై అయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం తగదని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కోర్టులు నడిపిస్తాయా అని కూడా అయన ప్రశ్నించారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ సీతారాం కామెంట్స్ న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని అయన పిటిషన్ లో ప్రస్తావించారు. న్యాయ వ్యస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యాఖ్యలు ఉన్నాయని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల తిరుపతిలో న్యాయ వ్యవస్థపై చేసిన కామెంట్స్ పై రమేష్ నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
న్యాయ వ్యవస్థపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రమేష్ నాయుడు కోరారు. ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ధిక్కరించి, అప్రతిష్టపాల్జేసి అవమానించడమే అవుతుందని అయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిర్ణయాన్ని హైకోర్టు తీసుకోవాల్సి ఉన్నది. ఈ పిటిషన్ పై రేపు లేదా ఎల్లుండి ఆన్ లైన్ ద్వారా విచారణ జరిగే అవకాశం ఉన్నది.
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 70 అంశాలలో ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు తీర్పును తప్పు పడుతూ పలువురు వైకాపా నేతలు కామెంట్స్ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ పరిస్థితిలో స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై పిల్ దాఖలు కావడంతో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.