రైతు బాగుంటేనే రాష్ట్రం కూడా మంచిగా ఉంటుందనీ, ఈ నేపథ్యంలోనే రైతుల మేలుచేసే భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు “రైతు భరోసా” పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, రైతు భరోసా పథకం ఓ బోగస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ. 77,500 ఎగ్గొట్టారంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదనీ, వైసీపీ సర్కారు ప్రకటనలకే పరిమితమైందన్నారు. రైతులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గొప్పగొప్ప ప్రకటనులు చేస్తూ.. నమ్మకద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షల ఎకరాల్లో పంట నీటి మునిగిందనీ, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో చంద్రబామునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో పాటు 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, వైసీపీ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు వంటి ఇతర అంశాలపై ఆయన ప్రసంగించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా పథకం ఒక బోగస్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా ద్వారా ఐదేళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ సర్కారు ఇచ్చేది కేవలం రూ.37,500 మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చివుంటే తాము తీసుకురావాలనుకున్న పథకాల ద్వారా ఒక్కో రైతుకు రూ.1.15 లక్షలు వచ్చేవని వెల్లడించారు. అలాగే, ఎన్నికల ముందు విపత్తు సహాయ నిధికి రూ.4 వేల కోట్లు ఇస్తామంటూ రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని చంద్రబాబు అన్నారు.