అమరావతి: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంపై కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేగాక, ‘ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..’ ఇదీ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో నేతలతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ మూడు పార్టీలపై విమర్శలు గుప్పించారు.
ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ విఫలమైంది కాబట్టి.. టీఆర్ఎస్ తెర వెనకుండి ఏపీ ఆ పార్టీకి సహకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి టీఆర్ఎస్ కార్యకర్తలను పంపుతానంటున్నారని, తాను కూడా అదే కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఏపీని ద్వేషించి తీవ్ర అన్యాయం చేసిన వారితో జగన్ అంటకాగుతున్నారని, దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. జగన్ పార్టీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. ఏపీని మరో బీహార్గా చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని.. ఒకవేళ జగన్ పార్టీ అధికారంలోకి వస్తే గల్లీగల్లీకి రౌడీలు తయారవుతారు. అంతేగాక, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు పెంచేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు, ఒంగోలు, దెందులూరు, కొండవీడు ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు.
ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కావాలనే గగ్గోలు పెడుతోందన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వైసీపీ కాచుకుని ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. దేశ ప్రజలు ప్రధాని మోదీని భరించే పరిస్థితిలో లేరని అన్నారు.
‘మహానాయకుడు’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తెలుగుజాతికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాన్ని ఎంతో చక్కగా చూపించారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. నాటి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఆ చిత్రాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానాయుకుడు’ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించారు.