తెలుగుదేశంలో హయాంలో భారీ అవినీతి జరిగిందని వైసీపీ మొదటి నుంచీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం కొందరు కీలక అధికారులకు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేందుకు నియమించారు. సీఎం పేషీలోని కొందరు ఐఏఎస్ లు ఇదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అనేక అవినీతి అంశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏటా ఊరూ వాడా భారీ ఎత్తున ఖర్చు చేసిన ఓ పథకంపై విచారణ చేపట్టబోతోంది. ఈమేరకు హైకోర్టుకి సమాచారం కూడా అందించింది.
నీరు–చెట్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది..
నీరు-చెట్టు పనుల్లో భాగంగా తమకు రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదని కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాదరావు, శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పథకం పనుల్లో గత ప్రభుత్వ హయాంలో భారీ అవకతవకలు జరిగాయని.. వాటిపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతోందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకే నిధుల చెల్లింపులు నిలిపేశామని జస్టిస్ రజినీ ముందు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున లాయర్లు విన్నవించారు. నివేదికలు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
నిజం లేకపోలేదు.. కానీ..
పథకంలో భాగంగా ఊళ్లలో వినియోగం లేని చెరువులు, గట్లకు మరమ్మతుల పేరుతో అవసరం లేకపోయినా నిధులు ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనుల వల్ల 25 నుంచి 35వేల కోట్లు ఖర్చు చేశారు. దీనిలో 50శాతం మేర దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులను స్థానిక నేతలకు కేటాయించి గ్రామస్థాయి టీడీపీ నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ లబ్ది పొందారనేది వైసీపీ వాదన. దీనిలో కొంతమేర వాస్తవం ఉంది. అయితే.. ఈ పథకంతో జరిగిన మేలు గురించి ప్రస్తావిస్తే.. గతంలో చెరువుల్లో నీళ్లు నిలిచేవి కావు. కానీ.. ఇప్పుడు పడుతున్న వర్షాలకు నీరు నిల్వ ఉంటోంది. ఈ ఫలితాలున్నా అవినీతికి ఆస్కారం ఉండకూడదనేది ప్రభుత్వం వాదన. అందుకే ఈ పథకంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో జగన్ ప్రభుత్వం ఉంది. మరి.. ఇది ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.