ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నాయకుడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. సొంత పార్టీకే కొరకరాని కొయ్యగా మారారు. పార్టీలోని తప్పులను నిర్మొహమాటంగా చెప్తూ పార్టీలోని అందరికీ శత్రువు అయ్యారు. ప్రభుత్వానికి సంబంధించి రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ సీఎం జగన్ కు తలనొప్పిగా మారారు. అయితే.. సీఎం జగన్ ఆయనపై స్పందించటం లేదు. పార్టీ వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే.. రఘురామకృష్ణ రాజు చేస్తోంది వైసీపీకి లాభమే అనేది ఒక వాదన. వైసీపీ నేతలు సీఎం జగన్ భజన చేస్తారే కానీ.. లోటుపాట్లను చెప్పే ధైర్యం చేయలేరు. నిజానికి పార్టీలో, ప్రభుత్వంలో ఒప్పులతోపాటు తప్పులు కూడా ఉంటాయి. కానీ.. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుంటేనే పార్టీ, ప్రభుత్వానికి కూడా మేలు అనే విషయం తెలియంది కాదు.
బీజేపీ, టీడీపీ, జనసేన చేయలేనిది రఘురామ.. చేస్తున్నారా..
ఈ మూడు పార్టీలు ప్రభుత్వంపై మతపరంగానే టార్గెట్ చేస్తున్నాయి. కానీ.. ప్రభుత్వంలోని తప్పొప్పులను రెబల్ ఎంపీగా రఘురామకృష్ణ రాజు నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. ఎంపీ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించినా సీఎం జగన్ వాటిని అమలు చేస్తే ప్రభుత్వానికే మేలు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏకంగా జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా విమర్శలు విపక్షాలు చేస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా పెద్దగా పట్టించుకోదు. పైగా పార్టీ నాయకులే సీఎంకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ.. రెబల్ ఎంపీగా రఘురామకృష్ణ రాజు ఆ పని చేస్తున్నారు.
ఆయన వ్యాఖ్యల్లోని మర్మాన్ని సీఎం జగన్ పరిశీలిస్తారా..?
వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా వెళ్తుంటే.. అమరావతే ఉండాలని ఏకంగా ఉప ఎన్నిక, రిఫరెండం అంటూ చాలెంజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, రంగులు, వినాయకచవితి, టీటీడీ డిక్లరేషన్.. ఇలా ప్రతి నిర్ణయంపై ప్రభుత్వంపై వ్యతిరేకంగా వెళ్తున్నారు. అమ్మఒడి డబ్బులు నాన్న వడ్డీకి సరిపోలేదనడం.., రైతులకు ఎరువులు లభించడంలేదని విమర్శలు చేస్తున్నారు. అమ్మఒడి డబ్బులను మద్యానికి ఖర్చు పెట్టే తండ్రులకు నియంత్రించడం.. రైతులకు సకాలంలో ఎరువులు అందించడం చేయొచ్చు. వైసీపీకి నష్టం చేస్తూనే ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులను నిష్కర్షగా చెప్తూ తన రాజకీయ ప్రస్ధానాన్ని రిస్క్ చేస్తున్నారు. మరి సీఎం జగన్ వీటిని స్వీకరిస్తారా అనేదే ప్రశ్న.