అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగే ఎన్నిక ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
ఎనిమిదొవ తేదీ ఉదయం దేవెగౌడ బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత అదే జిల్లాలోని ఉంగుటూరు, కృష్ణా జిల్లాలోని తిరువూరు, పామర్రు, పెడన సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు విజయవాడ చేరుకుని బెంగళూరు బయలుదేరుతారు.
ఇప్పటికే టిడిపికి మద్దతుగా జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.