అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్పశ్రీవాణిని కులం వివాదం వెంటాడుతూనే ఉంది. విజయనగరం జిల్లా కురుపాం ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ పుష్పశ్రీవాణి విజయం సాధించారు. తొలి సారి గెలిచినప్పుడే ఆమె ఎస్టి కాదని కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విచారణ పెండింగ్లో ఉంది. మొన్నటి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సమయంలోనూ బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బినామీ గిరిజనుల మూలంగా అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాజాగా తీసుకున్న కుల దృవీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉన్నా పుష్పశ్రీవాణి 2013లో తీసుకున్న దృవీకరణ పత్రాన్నే నామినేషన్ సమయంలో సమర్పించారని గాంధీ ఆరోపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి దానిని ఏ విధంగా ఆమోదించారని గాంధీ ప్రశ్నిస్తున్నారు.
పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన అనంతరం ఆమె ఎస్టి కాదని అప్పటి పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ విచారణ చేసి నిర్ధారించారని గాంధీ అన్నారు.
రామతులసి ఎస్టి కానప్పుడు ఆమె సోదరి పుష్పశ్రీవాణి ఎస్టి ఎలా అవుతారని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ప్రశ్నిస్తున్నారు. ఆమె కులానికి సంబంధించిన వివాదం కోర్టు విచారణలో ఉండగా ఆమెను ఎస్టి కోటా పేరుతో మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించడాన్ని అప్పలనర్స తప్పుబడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగుడెం మండలం దొరమామిడి గ్రామానికి చెందిన పాముల నారాయణమూర్తి కుమార్తె పుష్ప శ్రీవాణి. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. ఈమె విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు చంద్రశేఖరరాజు కుమారుడు పరీక్షిత్ రాజు సతీమణి.