అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఈ నెల 29న టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పరాజయంపై లోతైన విశ్లేషణ చేయనున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని జగన్ ఇచ్చిన పిలుపు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందనీ అందుకనే వారికి ఇంత ఘన విజయం సాధ్యమయ్యిందని గంటా అభిప్రాయపడ్డారు.
టిడిపి నుండి పోటీ చేసి విజయం సాధించిన ముగ్గురు మంత్రుల్లో గంటా ఒకరు. విశాఖ నార్త్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో తీవ్ర సందిగ్ధత, ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో చివరకు గంటా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తనను గెలిపించిన విశాఖ నగర ప్రజలకు గంటా కృతజ్ఞతలు తెలియజేశారు. టిడిపి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందనీ అయినా ప్రజలు మార్పు కోరుకున్నారని గంటా అన్నారు.