రాజమండ్రి: తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మనసులోని మాటను వ్యక్తం చేసే గుణం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలో ఉందనేది స్పష్టం అయ్యింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్మోహనరెడ్డి మాట్లాడిన తీరుపై మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజమండ్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విడిపోయిన తరువాత కూడా ఎవరూ సాధించలేనంతటి భారీ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసిన వైఎస్ జగన్ను తాను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.
నాడు ఎన్టిఆర్ ఘన విజయం సాధించిన సమయంలో కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకు సాగారనీ, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.
అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడంతో పాటు పారదర్శకతను పెంచుతానని జగన్ అనడం ఆయన పట్టుదలకు సంకేతమని ఉండపల్లి అభిప్రాయపడ్డారు.
నిన్న న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి మోదితో భేటీ తరువాత జగన్ మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే జగన్లో వైఎస్ స్పష్టంగా కనిపించారని ఉండవల్లి అన్నారు. మోదిని కలిసిన తరువాత ఆయనకు పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకున్నానని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ మాటలు చాలా మంచి గుణానికి సంకేతమనీ. అదే విధంగా ఆయన వ్యవహరిస్తే మంచి జరుగుతుందని ఉండవల్లి అన్నారు.
ప్రధాని మోది, తెలంగాణ సిఎం కెసిఆర్తో జగన్ సామరస్యంగా ఉండటం మన రాష్ట్రానికి మంచిదేనని ఉండవల్లి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఉండవల్లి అన్నారు. జగన్ రాష్ట్ర ప్రజల అభిమాన్ని పొందారనడానికి ఇదే నిదర్శనమని ఉండవల్లి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై దీర్ఘ ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందనీ, ఈ ప్రాజెక్టు పనులపై జ్యూడీషియల్ బాడీ ఏర్పాటు చేస్తామనడం హర్షనీయమని ఉండవల్లి అన్నారు.