ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పోతిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంటే.. ఏపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ఆపకూడదని ఏపీ భావిస్తోంది. దీంతో ఇప్పటివరకూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్య వీరిద్దరి మధ్య వ్యక్తిగత వైరాన్ని పెంచేలా ఉంది. గతంలో కూడా చంద్రబాబుకు, కేసీఆర్ కు మధ్య కూడా వ్యక్తిగత విబేధాలు ఏమీ ఉండేవి కావు. నీరు, విద్యుత్ విషయంలోనే వీరిద్దరి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు ఇద్దరు సీఎంలు కూడా నీటి విషయంలో రెండుసార్లు భేటీ అయినా సమస్యలు ఓ కొలక్కి రాలేదు. జగన్ సీఎం కావడంలో కేసీఆర్ కూడా కొంత సాయం చేశారు కాబట్టి.. ఇప్పుడు జగన్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది సందేహంగా మారింది. బుధవారం జగన్ నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ గురించి ఏమన్నారంటే..
కేసీఆర్ మాటలను పట్టించుకోవద్దని..
ఏపీలోని నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే అంగీకరిచేది లేదు. కేసీఆర్ మాటలు పట్టించుకోనవసరం లేదు. 20వ తేదీ తర్వాత జరిగే అపెక్స్ కౌన్సిల్ లో మన వాదన బలంగా వినిపిద్దాం. ప్రాజెక్టుల నిర్మాణంపై విభజనకు ముందు నుంచీ ఉన్న ఉత్తర్వులు సిద్ధం చేయండి అని అధికారులను ఆదేశించారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకెళ్లాలని భావిస్తున్న ఏపీ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ అంశం ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.