సిఎం జగన్మోహనరరెడ్డికి ఏదైనా తలనొప్పి అంశం ఉంది అంటే న్యాయ వ్యవస్థ మాత్రమే. సిఎం జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదంగా ఉండటం, అనేక ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలు తోడై కోర్టులో పిటిషన్ లు దాఖలు అవ్వడం జరుగుతూనే ఉంది. కోర్టు తీర్పుల్లో దాదాపు అన్నీ జగన్ కి, వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన తీర్పులు అన్నీ ఒక ఎత్తైయితే ఈ ఏకంగా సీఏం జగన్మోహనరెడ్డికి హైకోర్టు ఆరు మొట్టికాయలు ఒకే రోజు వేసింది. ఒక దాని వెంట ఒకటి. ఒకదాని వెంట ఒకటి తీర్పులతో ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహనరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రభుత్వంలో న్యాయ విభాగం లోపమో, జగన్ కు న్యాయ సలహాలు ఇస్తున్న వారి లోేపమో లేదంటే వైఎస్ జగన్ చేసుకుంటున్న స్వయకృతాపరాధమో కానీ హైకోర్టులో ఏ మాత్రం ప్రభుత్వ వాదనల్లో పస ఉండటం లేదు. తాజాగా ఈ రోజు వచ్చిన తీర్పులు చూస్తే…..
రాజధాని వికేంద్రీకరణ అంశంపై స్టేటస్ కో పొడిగింపు
ఏపిలో రాజధాని తరలింపు, సిఆర్ డిఎ చట్టం రద్దుపై స్టేటస్ కోను హైకోర్టు మరో సారి పొడిగించింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకూ స్టెటస్ కోను పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపుగా కౌంటర్ లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్ లపై రోజు వారి విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టెటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లభించలేదు.
విశాఖలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై సిఎస్ కు నోటీసు
విశాఖ నగరంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో దిక్కార పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై విచారణ సమయంలో రాష్ట్రపతి భవనం అయిదు ఎకరాల్లో ఉండగా…కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ఎలా కడతారనీ, ఒక వైపు స్టేటస్ కో అమలులో ఉండగా గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని న్యాయవాది నితీష్ గుప్తా ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం దీనిపై వచ్చె నెల పదవ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
అవ భూములపై సిబిఐకి నోటీసులు
తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. భూముల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ కు ఆదేశించాలనీ పిటిషనర్ ల తరపున న్యాయవాది కోరారు. వరద వచ్చినప్పుడు మునిగిపోయే భూములను ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేశారని న్యాయవాది వివరిస్తూ ఆవ భూముల ముంపునకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సిఎం జగన్, మంత్రులు బొత్స, బుగ్గనలకు నోటీసులు
రాజధాని అమరావతి కేసులో ఎపి హైకోర్టు గురువారం సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దురుద్దేశపూర్వకంగా రాజధాని తరలింపునకు చట్టాలు చేశారని అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్నధర్మాసనం సిఎంతో సహా మంత్రులకు నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల్లో రైతులకు కౌలు చెల్లించాలి
అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రెండు రోజుల్లో కౌలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడంపై దాఖలు అయిన పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా ఆదేశాలు ఇచ్చింది.