అమరావతి: వైసిపి అధినేత వైస్ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని నర్సీపట్నం నుంచి ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వివిధ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలను వైసిపి ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు.
ఈ నెల 17న విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 17 వ తేదీ ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, సాయంత్రం 2.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.
18వ తేదీ ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, మధ్యాహ్నం 12 గంటలకు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, 2.30 గంటలకు వైయస్ఆర్ జిల్లా రాయచోటిలో జరిగే సభల్లో పాల్గొననున్నారు.
19వ తేదీ ఉదయం 9.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెంలో, మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో, మధ్యాహ్నం 2.30 గంటలకు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో సభలు జరగనున్నాయి.
20వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ,మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో , మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగే సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.