Jogi Ramesh: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రతిపక్ష అనుకూల మీడియాకు జోగి రమేష్ టార్గెట్ కాగా, వైసీపీ అనుకూల మీడియాకు వార్తా వస్తువు అయ్యారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై జోగి రమేష్ స్పందించిన తీరు, చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లి నిరసన తెలియజేయడం ఈ ఏపిసోడ్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారం జోగి రమేష్ రాజకీయ భవిష్యత్తుకు చెడు చేస్తుందా? మంచి చేస్తుందా ? అనే విషయాన్ని పక్కన బెడితే.., సొంత పార్టీలో ఆయన ఒంటరయ్యారనే చేదు నిజాన్ని వెల్లడిస్తుంది. జోగి రమేష్ మొదటి నుండి కొంత దూకుడుగా వ్యవహరించే నేత, బీసీ సామాజిక వర్గ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న తరుణంలో ఇది కీలకంగా మారింది. కృష్ణా జిల్లాలో పెడన నుండి జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెడన పక్కనే ఉన్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని కాపు సామాజిక వర్గ కోటాలో మంత్రిగా ఉన్నారు. ఆ పక్కనే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కమ్మ సామాజిక వర్గ కోటాలో మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరిలో ఎవరినైనా తప్పిస్తే తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని రమేష్ ఆశిస్తున్నారు.
Jogi Ramesh: ఒంటరయ్యారు.. ఎలా అంటే..!?
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చనీయాంశం ఏమిటంటే అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ పై వైసీపీలోని ఏ ఒక్క ఎమ్మెల్యే రియాక్ట్ కానంత సీరియస్ గా రియక్ట్ అయ్యారు. కృష్ణాజిల్లా పెడన నుండి తన వర్గీయులతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కరకట్టపై చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పరిణామంతో టీడీపీ మొత్తానికి జోగి రమేష్ శత్రువుగా మారిపోయాడు. దీంతో టీడీపీ లో రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ అంటే పట్టాభి మొదలు కొని బొండా ఉమామహేశ్వరరావు ఇలా అన్ని జిల్లాల టీడీపీ నాయకులు జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే టీడీపీ నుండి ఇంత రియాక్షన్ వస్తుంటే రమేష్ కు అనుకూలంగా ఆ పార్టీ నేతలు పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఎక్కడో ఉన్న శ్రీకాంత్ రెడ్డి మరి కొందరు మాత్రమే జోగి రమేష్ కు మద్దతుగా మాట్లాడుతుంటే కృష్ణా జిల్లాలో పక్కనే ఉన్న మంత్రి పేర్ని నాని జోగి రమేష్ మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై విరుచుకుపడే మంత్రి కొడాలి నాని కూడా ఈ విషయం తరువాత పెద్దగా స్పందించలేదు. జోగి రమేష్ ను వెనుకేసుకుని వచ్చి మాట్లాడలేదు. టీడీపీ నేతలపై విమర్శలు సంధించలేదు. అదే విధంగా జిల్లాలోనే ఉన్న కొలుసు పార్థసారధి గానీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గానీ జోగి రమేష్ ఏపిసోడ్ కు అనుకూలంగా నోరు మెదపలేదు.
కృష్ణా జిల్లాలో అంతర్గత పోరు..!?
జోగి రమేష్ కు జిల్లాలోని నాయకులు ఈ అంశంపై ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని పరిశీలిస్తే జిల్లా వైసీపీలో ఉన్న అంతర్గత పోరు నడుస్తోంది. అది ఏమిటంటే ఒక వేళ సీఎం జగన్ కృష్ణాజిలాలో పేర్ని నాని, కొడాలి నానిలను మంత్రి వర్గం నుండి తప్పించి మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని భావిస్తే..జిల్లాలో అనేక మంది మంత్రిపదవిని ఆశిస్తున్నారు. సీనియారిటీ మరియు బీసీ సామాజిక వర్గ కోటాలో కొలుసు పార్థసారధి, కమ్మ సామాజికవర్గ కోటా నుండి వసంత కృష్ణ ప్రసాద్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు లు బీసీ కోటాలో, కాపు సామాజిక వర్గ కోటాలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇలా చాలా మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఒక వేళ వీరు జోగి రమేష్ కు మద్దతు ఇస్తే తాము పార్టీలో వెనుకబడిపోతామన్న భయంతో జోగి రమేష్ కు అనుకూలంగా ముందుకు రావడం లేదు. వైసీపీలో దూకుడుగా మాట్లాడే నాయకులు కూడా ఎవరూ జోగి రమేష్ కు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడటం లేదు. ఈ కారణాల వల్ల జిల్లా వైసీపీలో జోగి ఒంటరి అయిపోయాడు. ఈ విషయాలను జోగి రమేష్ అర్ధం చేసుకున్నా సరే పార్టీ పెద్దలకు మాత్రం జిల్లాలో పరిస్థితి తెలుసు. జిల్లా ఇన్ చార్జిలు గా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అయోధ్య రామిరెడ్డిలకు మొత్తం పరిస్థితులు తెలుసు కాబట్టి ఏమి జరుగుతుంది, ఎలా సార్ట్ అవుట్ చేస్తారు అనేది తెలుసు. ఏమి జరుగుతుంది అనేది వేచి చూడాలి.