విశాఖ ఎల్ జి పొలిమార్స్ కర్మాగారం అక్కడ నుండి తరలించాలి డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ సమీప గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాల వారు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిశ్రమలో పరిస్థితిని చూసేందుకు డీజీపీ సవాంగ్తో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ అక్కడికి చేరుకోగా స్థానికులు అడ్డుకున్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు దహన సంస్కారాలకు వెళ్లకుండా మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ముందుకు తీసుకునివచ్చి ఆందోళనకు దిగారు. తమకు పరిహారం ముఖ్యం కాదనీ, న్యాయం చేయాలనీ వేడుకున్నారు. అటు బాధితులు, ఇటు పోలీసులూ పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఫ్యాక్టరీ ముఖ్యం కాదు..ప్రజల ప్రాణాలే ముఖ్యం
తమ ప్రభుత్వానికి ఫ్యాక్టరీ ముఖ్యం కాదని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని, నిపుణుల కమిటీ నివేదిక అందిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్ హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. పరిశ్రమ పరిసరాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వదంతులను నమ్మవద్దని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉండి న్యాయం చేస్తుందని అవంతి హామీ ఇచ్చారు.
కొందరు కావాలనే ఆందోళన చేస్తున్నారు
కొందరు బయట నుండి వచ్చిన వ్యక్తులు కావాలనే ఆందోళన చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి నిపుణుల బృందం వస్తోందని వారు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తెలిపారు. అధికారులు చేస్తున్న పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందగా వందలాది మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. మృతులు, బాధిత కుటుంబాలకు గతంలో ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా సి ఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ… దర్యాప్తును జరిపి నెల రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. అవసరమైతే కర్మాగారాన్ని వేరే ప్రాంతానికి తరలించే విధంగానూ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సి ఎం జగన్ ప్రకటించారు.
బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
టీడీపీ నేతలు కింజరవు అచ్చెన్నాయుడు, రామానాయుడు, నిమ్మకాయల చిన్న రాజప్ప తదితర నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కంపెనీ ప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్.. కంపెనీ చాలా పెద్దదంటూ వెనుకోసుకొని రావడాన్ని తప్పు పట్టారు.