సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుండటంతో ఆ ప్రాంత వాసులు హర్షతి రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15 నుండే విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండే విశాఖలో పరిపాలన భవనాల ఏర్పాటుకు ఎంపి విజయసాయి రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రాధమిక సర్వే పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం, సీఎంఒ, సచివాలయ హెచ్ఒడీలు, ఇతర కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఒ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పర్యాటక శాఖ అతిధి గృహాలు ఉన్న రుషి కొండపై సిఎం నివాసం, భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం గ్రేహాండ్స్ స్థలంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. తిమ్మాపురం లోని గ్రేహాండ్స్ స్థలాన్ని సిఎం కార్యాలయానికి స్వాధీనం చేసుకున్నందున గ్రేహాండ్స్ కు ఆనందపురం ప్రాంతంలో 300 ఎకరాలు కేటాయించి అక్కడకు తరలించారు.
విశాఖ కేంద్ర కారాగారానికి సింహాచలం దేవస్థానం కేటాయించిన భూముల్లో డిజిపి, పోలీస్ శాఖ ల కార్యాలయాలను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ లు ఇప్పటి నుండే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు, భవనాలు పరిశీలించడంతో పాటు అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు.