సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీ టిడిపిని కలవర పరుస్తుంటే ప్రతిపక్ష పార్టీ వైసిపిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఎపి రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నవారు ఆ పరిణామాలేంటో ఇట్టే చెప్పగలరు. అవును…అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వరుసగా చోటుచేసుకుంటున్న వలసల గురించే మనం చెప్పుకుంటోంది. అనూహ్యంగా మొదలై అంతకంతకూ జోరందుకుంటున్న ఈ జంపింగ్ లు అధికార పార్టీలో కలత రేపుతుంటే వైసిపిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.
టిడిపి నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు వైసిపిలో చేరిపోగా మరికొందరు ఎమ్మెల్యేలతో పాటు ఒక మంత్రి, ఇంకొందరు ప్రముఖ నేతలు కూడా అతి త్వరలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎన్నికల ముంచుకొస్తున్న ఈ తరుణంలో టిడిపి ప్రతిష్టకు అది దెబ్బేనని చెప్పకతప్పదు. అయితే కేవలం అవకాశవాద నేతలే ఇలా పార్టీని వీడుతున్నారంటూ టిడిపి నాయకులు సమర్థించుకుంటున్నా…వరుసబెట్టి అధికార పార్టీ నేతలు ఇలా ప్రతిపక్షం వైసిపిలోకి వలస వెళ్లడంపై రాజకీయ శ్రేణుల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వలసలకు కారణమేమిటనే విషయమై విస్తృతస్థాయిలో విశ్లేషణలు చోటుచేసుకుంటున్నాయి.
గత ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి అధికారం చేపట్టిన అనంతరం వలసలకు సంబంధించి చోటుచేసుకున్న ఘటనలను అవలోకిస్తే త్వరలో తమ పార్టీలో టిడిపి ఎమ్మెల్యేలు చేరబోతున్నారంటూ వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఎపి రాజకీయాల్లో వలసలకు సంబంధించి తొలిసారిగా సంచలనం సృష్టించాయి. జగన్ వ్యాఖ్యలతో అలెర్ట్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి నుంచే ఆకరేషన్ ఆకర్ష్ కు తెరతీసారు. ఆ క్రమంలో మొత్తం 24 మంది వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టిడిపిలో చేరిపోయారు. వైసిపిని మరింత దెబ్బతీసేందుకు గాను సిఎం చంద్రబాబు ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులను సైతం కట్టబెట్టడం సంచలనం రేపింది. దీంతో ఇలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే తమ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడిన జగన్ ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించిన సంగతి తెలిసిందే.
ఆ తరువాత మళ్ళీ సుదీర్ఘ విరామం తరువాత ఇంతకాలానికి వలసల అంశం ప్రధాన శీర్షికలకు ఎక్కింది. అయితే ఎన్నికలకు ముందు వలసలు సహజమే అయినా అప్పుడే అలాంటి వలసలు మొదలవుతాయని గాని, అదీ అధికార పార్టీ టిడిపి నుంచి ప్రతిపక్ష పార్టీ వైసిపిలోకి జంపింగ్ లు చోటుచేసుకుంటాయని…అది కూడా ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీలు ఆ పార్టీలోకి వలస బాట పడతారని అనుభవజ్ఞులైన రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేయలేకపోయారు.
కారణాలు ఏమైనప్పటికీ ఇటీవలివరకు వలసలను ప్రోత్సహించిన…సమర్థించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇప్పుడు చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో విస్తుపోయి ఉంటారనడంలో సందేహం అక్కర్లేదు. రాజకీయ చాణుక్యుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు ఈ వలసలను ముందుగా పసిగట్టి నివారణా చర్యలు చేపట్టలేదా?…లేక ఆ చర్యలు ఫలించలేదా అనే సందేహం సర్వత్రా వ్యక్తమయింది.
అయితే పులి మీద పుట్రలా త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఒక మంత్రి, అలాగే స్వయంగా సిఎం చంద్రబాబు సమీప బంధువు ఒకరు కూడా వైసిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు తాజాగా వార్తలు వెలువడటంతో అసలేమి జరుగుతోందనే విషయమై విశ్లేషణలు మరింత జోరందుకున్నాయి. అధికార పార్టీ టిడిపి నుంచి ఈ వలసలకు కారణం…వచ్చే ఎన్నికల్లో టిడిపిపై వైసిపి విజయం సాధించడం ఖాయమనే నమ్మకమా?…లేక తమకు సీటు దొరకుతుందనే నమ్మకం లేక వైసిపిలో తాము కోరుకున్న సీటుపై స్పష్టమైన హామీ తీసుకొని ఆయా నేతలు ఆ పార్టీలో చేరుతున్నారా?…అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
తమ పార్టీ నుంచి వలసలకు కారణం అవకాశవాదమేనని టిడిపి అధినేత,సిఎం చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు బల్ల గుద్ది వాదిస్తున్నారు. పైగా ఆ నేతలు వాడటం తమకు మంచిదేనని…ప్రజాకర్షణ లేని ఇటువంటి నేతలు వెళ్లిపోవడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను పోటీలో దించటానికి తమకు అవకాశం ఏర్పడుతోందని అంటున్నారు. నియోజకవర్గాల పెంపు లేనందువల్ల తలెత్తే సమస్యల నుంచి ఈ వలసలు తమని తప్పిస్తాయని చెప్పుకొస్తున్నారు అయితే ఈ వాదనలన్నీ డొల్లేనంటూ వైసిపి నేతలు మాత్రం ఎద్దేవా చేస్తున్నారు.
ఏదేమైనా వైసిపిలో ట్రబుల్ షూటర్ లా మారిన విజయసాయిరెడ్డిదే ఈ చేరికల వెనుక కీలకపాత్ర అని, ఆయన త్వరలో మరికొంతమంది టిడిపి నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు జగన్ కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అసలే టికెట్ల కోసం ఆశావాహుల మధ్య తలెత్తిన విభేదాలతో సతమతమవుతున్న వైసిపిలో ఈ వలసలు సమస్యలను మరింత జటిలం చేస్తాయని…తద్వారా అధికార పార్టీ అయిన టిడిపికి ఆ పరిస్థితి లాభిస్తుందని టిడిపి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాస్తవంగా ఈ వలసల కారణంగా లబ్ధి పొందేది ఎవరు?…నష్టపోయేదెవరనేది రాబోయే ఎన్నికలే తేల్చనున్నాయి.