నంద్యాల: కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైసిపిలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి పార్టీ అధినేత వైఎస్ జగన్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బిజ్జం పార్థసారధి రెడ్డి 1999లో టిడిపి తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.
అలాగే అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపి నిజాముద్దీన్ కూడా తన అనుచరులతో కలిసి వైసిపిలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిజాముద్దీన్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకపోయినా తనను నమ్మి ఎంపిగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైసిపిలో చేరానన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు. వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని నిజాముద్దీన్ ఆకాంక్షించారు.
నిజాముద్దీన్ 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి ఎంపిగా ఎన్నికయ్యారు.