విశాఖ: జనసేన చేసే పోరాటం మార్పు కోసమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గాజువాక అభ్యర్థిగా విశాఖ జివిఎంసి కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం భహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
సీటు ఇస్తే పారిపోయేవాళ్ళని తీసుకురాలేదనీ, నిలబడే వారిని తీసుకొచ్చామనీ పవన్ అన్నారు. జనసేనలో నిలబడాలంటే ధైర్యం ఉండలని ఆయన పేర్కొన్నారు.
2014 లో టిడిపికి, బిజెపికి మద్దతిస్తే భూ కబ్జాలు, దోపిడీలు చేశారని పవన్ ఆరోపించారు. క్రిమినల్ పాలిటిక్స్ భరతం పట్టేందుకే విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణను నిలబెట్టామని పవన్ తెలిపారు.
అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం లక్ష్మీనారాయణ ప్రజాజీవితంలోకి వచ్చారని పవన్ కితాబిచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించే వ్యక్తులే పార్టీకి కావాలని పవన్ పేర్కొన్నారు.
టిడిపి, వైసిపిలు మంచి నాయకులను నిలబెడితే తాను మంచి నాయకులనే నిలబెడతానన్నారు. వారు మంచి నాయకులను నిలబెట్టకపోతే తాను అలాంటి వారినే నిలబెడతానని పవన్ అన్నారు.
రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తానని పవన్ పేర్కొన్నారు. పక్క పార్టీల క్రిమినల్స్ మీద పడితే ఎదుర్కోడానికి జనసేనకు మాస్ లీడర్లు కావాలన్నారు.
వైసిపి నేత జగన్ పై ఈ సందర్భంగా పవన్ విమర్శలు చేశారు. జగన్ జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంటుందని పవన్ అన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా? మనకు న్యాయం చేస్తారా? అని పవన్ ప్రశ్నించారు. వైసిపి నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
ఈ ఎన్నికల్లో తనకు తోడుంటే జీవితాంతం ప్రజలకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.