అమరావతి: పాపం ఆయనకు అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉండే అదృష్టం లేదేమో. ఆయన గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి రాదు. ఆయన పరాజయం పాలయినపుడు మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుంటోంది. నాలుగు సార్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాలు, ప్రజలు ఇదో నెగిటివ్ సెంటిమెంట్గా భావిస్తూ వస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పయ్యావుల కేశవ్ 2004,2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ రెండు సార్లు రాష్ట్రంలో టిడిపి అధికారంలో రాలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో అదే ఉరవకొండ నుండి పోటీ చేసిన పయ్యావుల కేవశ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. నాడు రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. నేటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ ఫలితంపై దోబూచులాట జరిగి అర్థరాత్రి దాటిన తరువాత పయ్యావుల విజయం సాధించినట్లు ప్రకటించారు. సెంటిమెంట్ ఫలించినట్లుగానే రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయం చవిచూసింది.
గెలిచిన ప్రతి సారి ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సిన పరిస్థితి రావడం పయ్యావుల బ్యాడ్లక్ అంటున్నారు.