వారసత్వంలో రాజసం ఉంది. గౌరవంలో ఎల్లలు లేని కీర్తి ఉంది. మొత్తంగా వారి వంశానికే ప్రతిష్ట ఉంది. కానీ.. అదేస్థాయిలో ఉన్న వ్యక్తిగత విబేధాలు వంశ ప్రతిష్టను దెబ్బ తీస్తోంది. విజయనగరం యువరాణుల మధ్య నెలకొన్న పోరు పూసపాటి వంశీయుల చరిత్రకు మచ్చ తెస్తోంది. మాటల దాడి చేసుకుంటూ వంశ గౌరవాన్ని పక్కన పెట్టేస్తున్నారు సిరిమానోత్సవం సందర్భంగా చెలరేగిన మనస్పర్ధలు వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. ఇది ఆ వంశ అభిమానులకు ఆవేదనకు గురి చేస్తోంది.
యువరాణుల మధ్య మనస్పర్ధలు..
కోట పైనుంచి ఉత్సవాలను చూడటం వంశీయులకు సంప్రదాయంగా ఉంది. ఊర్మిళ తన తల్లితో కలిసి కోట పైనుంచి ఉత్సవాలను తిలకించడంపై సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇక్కడి నుంచే వివాదం, వాగ్వివాదం మొదలైంది. సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టం లేకే ఇలా చేసాను. వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా ఇది నా బాధ్యతని ఊర్ళిళ అంటున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు తెలిస్తేనే సత్ ప్రవర్తన వస్తుంది. 1001 కొబ్బరి కాయలు పంచిపెడితే రాదు అని అదితి అంటున్నారు. సంచయిత ఎప్పుడూ అమ్మవారి పండుగకు గాని, మిగిలిన 105 దేవాలయాల పండగలకు గాని రాలేదు. అందువల్ల ఆమెకు ఎలా ప్రవర్తించాలో తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. కోట బురుజు మీద జరిగిన సంఘటన చాలా బాధాకరం అని అదితి అంటున్నారు.
రాజ వంశం అభిమానుల ఆవేదన..
మొన్నటివరకూ రాజవంశంలో రాజకీయాలు నడిచాయి. సంచయిత, అశోక్ గజపతిరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ ఆధిపత్యాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొక్కిపెట్టింది. ఇంకా ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు ఆ వంశానికి చెందిన యువరాణుల మధ్య మనస్పర్ధలు బయటకు వస్తున్నాయి. ఇందుకు పైడితల్లి సిరిమానోత్సవం వేదికైంది. సంచయిత, ఊర్మిళ, అదితి.. ఈ ముగ్గురూ తమ వాదనలకు పదును పెడుతూ వంశ చరిత్రను మంటగలుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. విజయనగరం రాజ కుటుంబీకుల్లో ఇటువంటి ధోరణిని రాజ వంశీయులు అభిమానునలు జీర్ణించుకోలేకపోతున్నారు. యువరాణులు ఆస్తుల వ్యామోహంలో పడ్డారని అంటున్నారు. ప్రజోపయోగ కార్యక్రమాలెన్నో చేసి దేవుళ్లుగా కీర్తి దక్కించుకున్న విజయనగర రాజుల చరిత్రను నిలబెట్టాలని కోరుకుంటున్నారు.