రాష్ట్రంలో ఇటీవల కొన్ని సంచలన సంఘటనలు జరిగాయి. వరుసగా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ప్రభుత్వాన్ని, పోలీసులను, ఏకంగా సీఎం జగన్ నే ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఆ సంఘటనపై ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి కార్యాలయం రంగంలోకి దిగడం అందరికంటే ఎక్కువగా సీఎం జగన్ పైనే ఒత్తిడి నెలకొంటుంది.
ఇది సామాజిక వర్గ పరంగా సెంటిమెంట్ వ్యవహారం కావడం, రాజకీయంగా రచ్చ కానుండటం, అందులోకి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒ అధికారి విచారణకు రంగంలోకి దిగుతుండటం సీఎం జగన్ ఒకింత ఒత్తిడిలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం ముదిరింది. ఇంతకీ విషయంలోకి వెళితే…
శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్
తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరో ముండనం వ్యవహారంపై రాష్ట్రపతి భవన్ దృష్టి సారించింది. జిల్లాలోని సీతానగరం పోలీసులు ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తీవ్రంగా స్పందించారు. దళిత యువకుడికి జరిగిన అవమానంపై రాజకీయంగా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దళిత సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక పోలీసులపైన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో భాదిత యువకుడు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాస్తూ తనను మావోయిస్టుల్లో చేరేందుకు అనుమతించాలని కోరడం తీవ్ర సంచలనం కల్గించింది. అయితే ఈ ఘటన పై ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ కు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్రపతి కార్యాలయం దీనిపై స్పందిస్తూ మొత్తం వ్యవహారంపైన విచారణకు గాను అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును విచారణ అధికారిగా నియమించింది. జనార్ధన్ బాబును కలిసి పూర్తి వివరాలు, కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్పింగులు అందించాలని బాధితుడు ప్రసాద్ కు సూచించింది. బాధితుడు లేఖ రాసిన 24 గంటల్లోనే రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం విశేషం.
ఇంకా అనేక ఘటనలు ఉన్నాయి.. చెమటలు పడుతున్నాయి
శిరోముండనం ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో ఇదే సమయంలో మరిన్ని సంచలన సంఘటనలు కూడా ఉన్నాయి. చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదీ సామాజిక వర్గ పరంగా సెంటిమెంటల్ వ్యవహారంగానే మారింది. ఇదే సమయంలో పలాసలో ఎస్సీ యువకుడిని సీఐ కాలుతో తన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో వరుసగా జరుగుతుండటం అన్నింటికీ వీడియో సాక్షాలు, ఆధారాలు ఉండటం, సోషల్ మీడియాలో వీడియోలు విపరీతంగా ట్రోల్ కావడంతో ప్రభుత్వంపైన, పోలీసులపైనా, ప్రభుత్వ పెద్దలపైనా ఒత్తిడి నెలకొంటోంది. మరి దీన్ని సీఎం జగన్ ఏ స్టైల్ లో డీల్ చేస్తారు? ఎంత వరకు సద్దుమణిగిస్తారు? అనేది కీలకంగా మారింది.