AskKtr: కేటీఆర్ AskKtr ఓపక్క ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రైవేటు ఆసుపత్రలు తీరు మారటం లేదు. మరోవైపు పేదలకు, సామాన్యులకు కరోనా వైద్యం, ఇతరత్రా సౌకర్యాలు భారమయ్యాయి. ఈనేపథ్యంలో తలకు మించిన భారమైన కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చితే రాష్ట్ర ప్రజలకు మరింత ప్రయోజనమే దక్కుతుంది. ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడుతుంది. గతంలో ఓసారి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మెచ్చుకున్నారు. పేదలకు ఉపయోగపడే మంచి పథకం తీసుకొచ్చారని సభలో దివంగత సీఎం వైఎస్సార్ పేరును ప్రస్తావించారు. మరి.. అదే సీఎం నేడు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాంత్వన చేకూర్చే కరోనా వైద్యాన్ని ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ వైద్యపరంగా ఎటువంటి సాయం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు.. అవసరమైన సాయం అందిస్తున్నారు. ఇది ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుత కరోనా సమయంలో కూడా కేటీఆర్ ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే.. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంపై మాత్రం ఆయనకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇదే విషయమై మంత్రి కేటీఆర్ కు కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటివలే ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో ఒక చాట్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ‘ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం.. తాను సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తా’నని చెప్తున్నారు. ఈ విషయం సీఎంకు తెలియంది కాదు.
సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి డైరక్ట్ గా, మీడియా ముఖంగా ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజామోదం పొందిన ప్రభుత్వంపై ఈ ప్రశ్నలు సరైనవి కావనే చెప్పాలి. నిజానికి.. రాష్ట్రంలో తనదైన ముద్ర వేసిన టీఆర్ఎస్ రెండోసారి అధికారంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా పోరాడి 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారం చేజిక్కించుకుని అయిదేళ్ల పాలనపై ప్రజామోదం ఎంతుందో చాటి చెప్పింది. ప్రజాకర్షక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు. అయితే.. ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడంతో మాత్రం విమర్శలు వస్తున్నాయి. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం ఏం సమాధానమిస్తుందో చూడాలి.